మాస్ మహరాజ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడుగా

ఇరుముడిపై రవితేజ నమ్మకం

మాస్ మహరాజ్ రవితేజ ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంతగా చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. అందుకు కారణం ఇరుముడి మూవీ. రవితేజ నుంచి ఓ మూవీ వస్తోందంటే ఆడియన్స్ లో మునుపటి ఉత్సాహం మాత్రం కనిపించడం లేదు. అందుకు అతని ఎంచుకుంటోన్న పరమ రొటీన్ మూవీసే కారణం. అయితే ఈ మధ్య కాస్త ట్రెండ్ మార్చాడు. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటున్నాడు. కానీ కథనం విషయంలో అవి మైనస్ గా మారుతున్నాయి. అతని లాస్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తితో కాస్త ఫర్వాలేదు అనిపించుకున్నాడు. ఆ కథ కూడా కొత్తదేం కాదు. బట్ రవితేజ ఇమేజ్ కు కొత్తగా అనిపించింది. ఆ ఊపులోనే ఇప్పుడు ఇరుముడి మూవీతో వస్తున్నాడు.

శివ నిర్వాణ దర్శకత్వం గురించి

శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఇరుముడి చాలా వేగంగా పూర్తి చేశారు. ఆగస్ట్ 21న విడుదల కాబోతోంది. తాజాగా అతను డబ్బింగ్ కూడా చెప్పడం పూర్తయింది. అంటే మూవీ ఎప్పుడో పూర్తయినట్టే కదా. ఏ మాటకాటే రవితేజ కొన్నాళ్లుగా చాలా వేగంగా సినిమాలు చేస్తున్నాడు. ఆ విషయంలోనే చాలాసార్లు రాంగ్ స్టెప్స్ పడుతున్నాయి. బట్ ఇరుముడి విషయంలో అలాంటిదేం ఉండదు అనే నమ్మకంతో ఉన్నాడు. ఇది ఓ మళయాల మూవీకి రీమేక్. బట్ తెలుగు వెర్షన్ లో చాలా మార్పులు చేశారు అని ముందు నుంచీ చెబుతున్నారు.

తెలుగులో ఇలాంటి మూవీస్ అరుదు

తెలుగులో ఇలాంటి మూవీస్ చూసి చాలాకాలం అయింది. అందుకే ఇరుముడి కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే రవితేజ గతంలో కంటే చాలా నమ్మకంతో కనిపిస్తున్నాడు. మామూలుగా అతని మూవీస్ కు ముందే ప్రమోషన్స్ చేయడు. బట్ ఇరుముడితో ఆ సెంటిమెంట్ పక్కన పెట్టాడు. డబ్బింగ్ టైమ్ నుంచి హడావిడీ చేస్తున్నాడు. మరి ఈ మూవీ విషయంలో అతనికి ఏమైనా మార్పులు వచ్చాయా లేదా అనేది పక్కన పెడితే రవితేజ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న మూవీ ఇది. వాళ్లు కూడా చాలా నమ్మకంగా ఉన్నారీ చిత్రంపై. హీరోయిన్ గా ప్రియా భవానీ శంకర్ చేస్తోంది. కీలక పాత్రల్లో బేబీ నక్షత్ర, సాయికుమార్, అజయ్ ఘోష్, శ్వాసిక వంటి వారు నటిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఏదేమైనా ఇరుముడితో రవితేజ మంచి విజయం అందుకోవడం ఖాయం అనిపిస్తోంది.

Continue reading
మారుతి కొత్త ఆశ.. వరుణ్ తేజ్‌తో సినిమా ఫిక్స్?

ఫలించిన మారుతి నిరీక్షణ.. వరుణ్ తేజ్‌తో కొత్త ప్రయాణం?

ఒక దర్శకుడి కెరీర్‌లో హిట్లు ఎంత ముఖ్యమో.. ఫ్లాపులు కూడా అంతే ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా స్టార్ హీరోతో చేసిన సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోతే ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. దర్శకుడు మారుతి పరిస్థితి కూడా ఇప్పుడు అలానే కనిపిస్తోంది.

‘ది రాజా సాబ్’ భారీ అంచనాల మధ్య విడుదలైనా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర కూడా సినిమా ఆశించిన స్థాయిలో నిలబడలేదు. విడుదల తర్వాత మారుతి స్వయంగా సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తున్నానని, తన తదుపరి సినిమాకు మరింత కష్టపడతానని చెప్పాడు.

ఇలాంటి సమయంలో ఆయన తదుపరి సినిమా ఎవరితో అనే ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది.

వరుణ్ తేజ్‌తో సినిమా దాదాపు ఖరారు?

ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్న తాజా టాక్ ప్రకారం.. వరుణ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రూపొందే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. గత కొన్ని నెలలుగా వరుణ్ తేజ్ పేరు మారుతి తదుపరి సినిమాతో అనుసంధానమవుతోంది.

అధికారిక ప్రకటన వచ్చే వరకు దీన్ని ఇండస్ట్రీ బజ్గానే చూడాలి.

ఇద్దరికీ ఈ సినిమా ఎందుకు కీలకం?

ఈ ప్రాజెక్ట్ నిజమైతే.. ఇది కేవలం మారుతికే కాదు.. వరుణ్ తేజ్‌కూ ఎంతో కీలకం.

ఇటీవలి కాలంలో వరుణ్ తేజ్‌కు కూడా ఆశించిన విజయాలు దక్కలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాల ఫలితాలు ఆయన మార్కెట్‌ను నిర్ణయించే అవకాశం ఉంది. అదే సమయంలో మారుతి కూడా మళ్లీ తన బలమైన జానర్ అయిన ఫ్యామిలీ కామెడీ, ఎంటర్‌టైనర్ వైపు అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మారుతి బలం అదే..

మారుతి కెరీర్‌ను పరిశీలిస్తే..

  • చిన్న కథలను వినోదాత్మకంగా చెప్పడంలో మంచి పేరు సంపాదించాడు.
  • ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే కామెడీ అతని ప్రధాన బలం.
  • స్టార్ హీరోల కన్నా మిడిల్ రేంజ్ హీరోలతోనే అతని విజయాలు ఎక్కువగా వచ్చాయి.

అందుకే వరుణ్ తేజ్‌తో సినిమా నిజమైతే.. అది మారుతి తన కంఫర్ట్ జోన్‌లోకి తిరిగి వచ్చినట్టే అవుతుంది.

కమ్‌బ్యాక్ అవుతుందా?

ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే దర్శకుడి ప్రతిభ పూర్తిగా ముగిసిపోయిందని చెప్పలేం. టాలీవుడ్‌లో చాలా మంది దర్శకులు ఒక పెద్ద పరాజయం తర్వాత మరింత బలంగా తిరిగి నిలబడ్డారు.

మారుతి విషయంలో కూడా అదే జరుగుతుందా లేదా అన్నది ఈ కొత్త ప్రాజెక్ట్‌పైనే ఆధారపడి ఉంటుంది.

వరుణ్ తేజ్‌తో సినిమా అధికారికంగా ప్రకటించి.. మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తే మారుతికి మరో అవకాశం దక్కినట్టే. లేదంటే ఆయనపై ఉన్న సందేహాలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.

GAARADI విశ్లేషణ

రాజాసాబ్ తర్వాత మారుతి కెరీర్ ఒక కీలక మలుపులో ఉంది. అదే సమయంలో వరుణ్ తేజ్ కూడా సరైన విజయాన్ని వెతుకుతున్నాడు. ఈ ఇద్దరి కలయిక నిజమైతే.. అది ఇద్దరికీ విన్-విన్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

Continue reading
కమిటీ కుర్రోళ్లు జాతీయ అవార్డులు : నిహారిక కొణిదెల ఎమోషనల్ కామెంట్స్

కమిటీ కుర్రోళ్లుకు జాతీయ అవార్డులు

తెలుగు సినీ పరిశ్రమలో కంటెంట్‌ ఆధారిత చిత్రాలకు మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడంతో పాటు, బెస్ట్ మేకప్ విభాగంలో కూడా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఈ విజయంతో చిత్ర బృందం ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది.

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత నిహారిక కొణిదెలతో పాటు దర్శకుడు యదు వంశీ, సాంకేతిక నిపుణులు, నటీనటులు తమ ఆనందాన్ని పంచుకున్నారు.నిహారిక కొణిదెల మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఆమె మాట్లాడుతూ.. “ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరి ప్రయాణం నాకు తెలుసు. ఈ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు రావడం నా మనసుకు ఎంతో సంతృప్తినిచ్చింది. నా 32 ఏళ్ల జీవితంలో ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మించాలనే నిర్ణయం నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటి.” మంచి సినిమా తీయడం మాత్రమే కాదు.. దాన్ని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.

“ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా పనిచేశారు. మంచి సినిమాలు తీస్తే ఇలాంటి గౌరవం వస్తుందని ఈ రోజు మరోసారి నిరూపితమైంది. అందుకే నేను జీవితాంతం సినిమాలనే చేస్తాను” అని చెప్పారు. “ఈ సినిమాను జాతీయ అవార్డు కోసం తీయలేదు. కానీ ప్రయాణం మొదలైన తర్వాత అవార్డు రావాలని మాత్రం నిజంగా కోరుకున్నాను. ఇప్పుడు ఆ కల నెరవేరింది’’ అని చెప్పింది. అలాగే.. మేకప్ టీమ్ చేసిన కష్టం, కొత్త నటీనటుల కోసం చేసిన, ట్రాన్స్‌ఫర్మేషన్, సాంకేతిక బృందం అంకితభావం అంటూ అన్నింటినీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

నేను మెగా ఫ్యామిలీకి అర్హురాలినని ఇప్పుడు గర్వంగా చెప్పగలను

“నేను కొణిదెల కుటుంబం నుంచి వచ్చాననే గుర్తింపుకంటే, ఇప్పుడు నేను కూడా ఆ కుటుంబానికి తగిన పని చేశాననే సంతృప్తి ఉంది. మెగా ఫ్యామిలీలో ఉండేందుకు అర్హురాలినని ఇప్పుడు గర్వంగా చెప్పుకోగలను.” అలాగే మెగాస్టార్ చిరంజీవి తనను అభినందించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘రుద్రవీణ’కు మీ నాన్న నాగబాబు జాతీయ అవార్డులు అందుకున్నారు.. ఇప్పుడు నువ్వు తీసుకుంటున్నావు.. మాకు గర్వంగా ఉంది’ అని చిరంజీవి గారు చెప్పడం జీవితాంతం గుర్తుండిపోతుంది” అని తెలిపారు.

దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ..

“ఈ కథకు జాతీయ అవార్డు వస్తుందని నేను షూటింగ్ ప్రారంభం నుంచే చెబుతున్నాను. కానీ కొత్త దర్శకుడు, కొత్త నటీనటులతో ఇంత పెద్ద బడ్జెట్ పెట్టేందుకు చాలామంది వెనక్కి తగ్గారు.” అయితే.. నిహారిక కొణిదెల, మన్యం రమేష్ తనపై నమ్మకం ఉంచి ఎలాంటి రాజీ పడకుండా సినిమా నిర్మించారని చెప్పారు. “ఒక్క సీన్ కూడా కట్ చేయలేదు. బిజినెస్ గురించి ఆలోచించకుండా కథను నమ్మారు. అదే ఈ రోజు జాతీయ అవార్డుల రూపంలో ఫలించింది” అని అన్నారు.

సాంకేతిక నిపుణులకు దక్కిన గౌరవం

ఈ సందర్భంగా..

సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్
సినిమాటోగ్రాఫర్ రాజు ఎదురోలు
ఎడిటర్ అన్వర్ అలీ
నిర్మాత ఫణి అడపాక
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్
మేకప్ ఆర్టిస్ట్ పి. రవి కుమార్
డైలాగ్ రైటర్లు కొండల్ రావు, వెంకట్ సుబాష్.. అందరూ ఈ విజయం మొత్తం టీమ్ కృషి ఫలితమని చెప్పారు.

ప్రత్యేకంగా మేకప్ ఆర్టిస్ట్ పి. రవి కుమార్ మాట్లాడుతూ..

“కమిటీ కుర్రోళ్లు లాంటి సినిమాలో పని చేయడం ఒక పీహెచ్‌డీ చేసినంత అనుభవం” అని వ్యాఖ్యానించారు.

నటీనటుల ఆనందం

సందీప్ సరోజ్, ప్రసాద్ బెహరా, విషిక, తేజస్వి తదితరులు మాట్లాడుతూ..

కథ విన్న రోజే ఈ సినిమా ప్రత్యేకమని భావించామని,
ఇప్పుడు జాతీయ అవార్డు రావడంతో తమ కష్టం ఫలించిందని,
ప్రేక్షకులు, మీడియా ఇచ్చిన ఆదరణే ఈ విజయానికి కారణమని తెలిపారు.

కమిటీ కుర్రోళ్లు ఎందుకు ప్రత్యేకంగా నిలిచింది?

‘కమిటీ కుర్రోళ్లు’ గ్రామీణ నేపథ్యంలో సాగే స్నేహం, సంబంధాలు, కుల-సామాజిక విభేదాలు, యువత భావోద్వేగాలను సహజంగా ఆవిష్కరించిన కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా. కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం కథనం, సహజ నటన, సాంకేతిక నాణ్యతకు మంచి ప్రశంసలు అందుకుంది. విడుదల సమయంలో విమర్శకుల ప్రశంసలతో పాటు వాణిజ్యపరంగానూ మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు రెండు జాతీయ అవార్డులు దక్కడం ద్వారా ఆ విజయానికి మరో ముద్ర పడింది.

ముగింపు

చిన్న కథను నమ్మి, కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చి, కొత్త నటీనటులతో ప్రయోగం చేసిన నిహారిక కొణిదెల ధైర్యం ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. ‘కమిటీ కుర్రోళ్లు’ సాధించిన రెండు జాతీయ అవార్డులు కేవలం ఒక సినిమా విజయమే కాదు.. కంటెంట్‌ను నమ్మిన తెలుగు సినీ పరిశ్రమకు దక్కిన గౌరవం కూడా. ఈ విజయోత్సవంలో చిత్ర బృందం వ్యక్తం చేసిన భావోద్వేగాలు, వారి ప్రయాణం వెనుక ఉన్న కష్టం ప్రేక్షకులను కూడా కదిలించాయి.

Continue reading
72వ నేషనల్ అవార్డ్స్ లో సత్తా చాటిన తెలుగు సినిమాలు

72వ నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమా మరోసారి సత్తా చాటింది.

కమిటీ కుర్రాళ్లు, పుష్ప 2, కల్కి 2898 AD, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలు వివిధ విభాగాల్లో జాతీయ అవార్డులు సాధించి టాలీవుడ్‌కు గర్వకారణంగా నిలిచాయి.

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా జోరు

ఒకప్పుడు జాతీయ చలనచిత్ర అవార్డులు అంటే తెలుగు సినిమాలకు చాలా దూరంగా ఉండేవి. అప్పుడప్పుడు ఒక్కో అవార్డు వచ్చినా అది పెద్ద విశేషంగా మారేది. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చే తెలుగు సినిమాలు వరుసగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి.

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన కూడా అదే విషయాన్ని మరోసారి నిరూపించింది. కమర్షియల్ సినిమాలతో పాటు మంచి కథ, బలమైన రచన, సాంకేతిక నైపుణ్యం ఉన్న చిత్రాలు ఈసారి కూడా అవార్డులను సొంతం చేసుకున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు ఇది గర్వకారణమనే చెప్పాలి.


ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రాళ్లు’

ఈ ఏడాది ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రాళ్లు’ ఎంపిక కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

యదువంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కొణిదెల నిహారిక నిర్మించారు. పెద్ద స్టార్ హీరోలు లేకపోయినా మంచి కథ, సహజమైన పాత్రలు, గ్రామీణ నేపథ్యం కారణంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ఇప్పుడు జాతీయ అవార్డు రావడంతో ఈ సినిమా స్థాయి మరింత పెరిగింది. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులతో పాటు జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు దక్కుతుందనే విషయాన్ని ఈ చిత్రం మరోసారి నిరూపించింది.


‘కమిటీ కుర్రాళ్లు’కు మరో గౌరవం

ఈ చిత్రానికి ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ విభాగంలో పీ. రవికుమార్ జాతీయ అవార్డు అందుకోవడం మరో విశేషం.

పాత్రలకు తగ్గట్టుగా సహజమైన లుక్స్ తీసుకురావడంలో ఆయన చేసిన కృషికి ఈ అవార్డు దక్కింది.


‘లక్కీ భాస్కర్’కు బెస్ట్ డైలాగ్స్

దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ చిత్రానికి వెంకీ అట్లూరి రాసిన సంభాషణలకు ఉత్తమ డైలాగ్ రైటర్ అవార్డు లభించింది.

షేర్ మార్కెట్ వంటి క్లిష్టమైన అంశాన్ని సాధారణ ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పడంలో ఈ సినిమా విజయవంతమైంది. అందులో డైలాగ్స్ కీలక పాత్ర పోషించాయి. అందుకే వెంకీ అట్లూరి జాతీయ అవార్డు అందుకోవడం ఆశ్చర్యంగా అనిపించదు.


‘పుష్ప 2’కు రెండు జాతీయ అవార్డులు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 కూడా రెండు విభాగాల్లో జాతీయ గుర్తింపు దక్కించుకుంది.

  • ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – సుకుమార్
  • ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – దీపాలి నూర్, శీతల్ శర్మ

పుష్ప 2లో కథన నిర్మాణం, పాత్రల తీరు, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అదే సమయంలో పాత్రలకు తగ్గ దుస్తుల రూపకల్పన కూడా ప్రత్యేకంగా నిలిచింది. ఈ రెండు విభాగాల్లో అవార్డులు రావడం సినిమాకు మరో గౌరవంగా చెప్పాలి.


‘కల్కి 2898 AD’కు బెస్ట్ పాపులర్ ఫిల్మ్

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 AD చిత్రానికి ఉత్తమ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డు లభించింది.

భారీ విజువల్స్, పురాణాలను సైన్స్ ఫిక్షన్‌తో మేళవించిన కథ, అద్భుతమైన సాంకేతిక నాణ్యత ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. కమర్షియల్ విజయంతో పాటు జాతీయ అవార్డు కూడా దక్కడం చిత్రబృందానికి మరో గౌరవం.


’35 చిన్న కథ కాదు’కు ఉత్తమ బాలల చిత్రం

ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్న 35 చిన్న కథ కాదు చిత్రానికి ఉత్తమ బాలల చిత్రం అవార్డు లభించింది.

పిల్లల భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, చదువు ఒత్తిడి వంటి అంశాలను ఎంతో హృద్యంగా చూపించిన ఈ సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం తెలుగు సినిమాకు మరో మంచి వార్త.


ప్రధాన అవార్డుల్లో విజేతలు

ఈసారి ప్రధాన విభాగాల్లో కూడా ఆసక్తికర ఫలితాలు వచ్చాయి.

  • ఉత్తమ నటుడు – మమ్ముట్టి (భ్రమయుగం) మరియు కార్తీక్ ఆర్యన్ (చందు ఛాంపియన్) సంయుక్త విజేతలు.
  • ఉత్తమ నటి – యామీ గౌతమ్ (ఆర్టికల్ 370)
  • ఉత్తమ దర్శకుడు – రాజ్‌కుమార్ పెరియసామి (అమరన్)
  • ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ఆర్టికల్ 370
అవార్డు విజేత
ఉత్తమ తెలుగు చిత్రం కమిటీ కుర్రాళ్లు
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే సుకుమార్ – పుష్ప 2
ఉత్తమ డైలాగ్స్ వెంకీ అట్లూరి – లక్కీ భాస్కర్
ఉత్తమ కాస్ట్యూమ్స్ పుష్ప 2
ఉత్తమ పాపులర్ ఫిల్మ్ కల్కి 2898 AD
ఉత్తమ బాలల చిత్రం 35 చిన్న కథ కాదు

తెలుగు సినిమాకు మరో గర్వకారణం

ఈసారి జాతీయ అవార్డుల్లో తెలుగు చిత్రాలు కేవలం ఒక్క విభాగానికే పరిమితం కాలేదు. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, మేకప్, కాస్ట్యూమ్స్, ఉత్తమ ప్రాంతీయ చిత్రం, పాపులర్ సినిమా, బాలల చిత్రం వంటి పలు విభాగాల్లో తెలుగు సినిమాలు తమ ముద్ర వేశాయి.

ఇది తెలుగు సినిమా నాణ్యత పెరుగుతోందనే విషయానికి మరో నిదర్శనం. కమర్షియల్ విజయాలే కాకుండా కంటెంట్‌కు కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందనేది తెలుగు సినీ పరిశ్రమకు మంచి సంకేతం.

Continue reading
ఓ.. సుకుమారి మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉంది..?

కామెడీ కంటే షాకులే ఎక్కువ!

Rating: ⭐⭐☆☆☆ (2/5)

కొన్ని సినిమాలు ట్రైలర్ చూస్తేనే “ఇందులో ఏదో కొత్తగా ఉంది” అనిపిస్తాయి. Oh Sukumari కూడా అలాంటి సినిమానే. హీరోయిన్‌ను ఎవరైనా తాకితే కరెంట్ షాక్ కొట్టడం అనే కాన్సెప్ట్ వినడానికి కొత్తగా అనిపిస్తుంది. కానీ ఆ చిన్న పాయింట్‌ను రెండున్నర గంటల సినిమా వరకు ఆసక్తికరంగా తీసుకెళ్లగలిగారా అంటే… సమాధానం మాత్రం కాదు.


కథ

తెలంగాణలోని ఓ చిన్న గ్రామంలో పుట్టిన దామిని (ఐశ్వర్య రాజేష్) చిన్నప్పటి నుంచే ఓ విచిత్రమైన సమస్యతో బాధపడుతూ ఉంటుంది. ఆమెను ఎవరైనా తాకితే వారికి కరెంట్ షాక్ తగులుతుంది. దీంతో ఊరివాళ్లు ఆమెను దూరం పెడతారు.

మరోవైపు యాదగిరి (తిరువీర్) తన తాత వీలునామా కారణంగా వెంటనే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉంటాడు. అలా దామినిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె సమస్య తెలియకుండా పెళ్లి చేసుకుంటాడు.

పెళ్లి తర్వాత ఏమైంది? ఈ విచిత్రమైన సమస్య వారి జీవితాన్ని ఎలా మార్చింది? అత్తింట్లో ఎదురైన పరిస్థితులు ఏంటి? చివరకు దామిని సమస్యకు పరిష్కారం దొరికిందా? అనేదే మిగతా కథ.


ఎలా ఉంది?

ఈ సినిమా మొత్తం ఒకే కాన్సెప్ట్ మీద నడుస్తుంది.

హీరోయిన్‌ను తాకితే షాక్ కొడుతుంది.

ఇది ట్రైలర్‌లో బాగానే అనిపించింది. కానీ సినిమాలో ఇదే పాయింట్‌ను పదే పదే తిప్పి చూపించడం వల్ల కొంతసేపటికే రిపీట్ ఫీలింగ్ మొదలవుతుంది.

ఇలాంటి కథల్లో బలమైన కామెడీ లేదా గట్టి ఎమోషన్ ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండాలి. కానీ దర్శకుడు ఈ రెండింటినీ పూర్తిగా వాడుకోలేకపోయాడు.

మొదటి భాగంలో కొన్ని చోట్ల నవ్వులు వస్తాయి. అయితే అవి సినిమా మొత్తాన్ని నిలబెట్టే స్థాయిలో మాత్రం లేవు.

రెండో భాగం మరింత నెమ్మదిగా సాగుతుంది. అసలు కథలో ఉండాల్సిన కాన్‌ఫ్లిక్ట్ కూడా అంత బలంగా అనిపించదు.

హీరో 80 ఎకరాల ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నానని చెప్పే ట్రాక్ కూడా అంతగా కన్విన్స్ చేయదు.

హీరోయిన్ సమస్య తెలిసిన తర్వాత కూడా అత్తింట్లో ఎవరూ దానిని సీరియస్‌గా తీసుకోకపోవడం కూడా లాజిక్‌కు దూరంగా ఉంటుంది.

మొత్తానికి మంచి ఐడియా ఉన్నా… దానికి తగ్గ స్క్రీన్‌ప్లే మాత్రం కనిపించదు.


ఎవరు ఎలా చేశారు?

తిరువీర్ తనకు ఇచ్చిన పాత్రను నిజాయితీగా చేయడానికి ప్రయత్నించాడు. కానీ పాత్రలో పెద్దగా ఎలివేషన్ లేకపోవడంతో అతని నటన కూడా చాలా చోట్ల సాధారణంగానే కనిపిస్తుంది.

ఐశ్వర్య రాజేష్‌కు పాత్ర కొత్తగా ఉన్నప్పటికీ, స్క్రీన్‌పై ఆశించినంత ప్రభావం చూపించలేకపోయింది. నటన పరంగా ఓకే అనిపిస్తుంది.

మురళీధర్ గౌడ్, ఝాన్సీ తమ అనుభవంతో కొన్ని సన్నివేశాలను నిలబెట్టారు.

ఆమని పాత్ర మాత్రం ఉన్నా లేనట్టే అనిపిస్తుంది.


టెక్నికల్‌గా

భరత్ మాచిరాజు సంగీతం పెద్దగా గుర్తుండదు.

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే.

సి.హెచ్. కుషేందర్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించింది.

ఎడిటింగ్ మాత్రం ఇంకాస్త క్రిస్ప్‌గా ఉండాల్సింది. ముఖ్యంగా రెండో భాగంలో చాలా ల్యాగ్ కనిపిస్తుంది.

దర్శకుడు భరత్ దర్శన్ మంచి కాన్సెప్ట్‌ను ఎంచుకున్నప్పటికీ, దాన్ని ఆసక్తికరమైన కథగా మార్చడంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు.


Plus Points

  • కొత్త కాన్సెప్ట్
  • కొన్ని కామెడీ సన్నివేశాలు
  • గ్రామీణ నేపథ్యం

Minus Points

  • బలహీనమైన స్క్రీన్‌ప్లే
  • ఎమోషన్ మిస్సింగ్
  • లాజిక్ లేని సన్నివేశాలు
  • నెమ్మదిగా సాగే రెండో భాగం
  • గుర్తుండని పాటలు

చివరగా

Oh Sukumari వినడానికి కొత్త ఐడియాతో వచ్చిన సినిమా. కానీ కొత్త ఐడియా ఒక్కటే సరిపోదని మరోసారి నిరూపించింది.

కొన్ని నవ్వులు పంచినా… పూర్తి స్థాయిలో ఎంటర్‌టైన్ చేయలేకపోయింది.

ఈ సినిమాకు “Oh Sukumari” అనే టైటిల్ కంటే “Shockumari” అనే టైటిల్ పెట్టి ఉంటే ఇంకా బాగా సెట్ అయ్యేదేమో అనిపిస్తుంది.

మా రేటింగ్: ⭐⭐☆☆☆ (2/5)

Continue reading
మళయాలంలో టాప్ లేపిన తెలుగు సంగీత దర్శకుడు విద్యా సాగర్

24శాఖలు ఎంతో కష్టపడితేనే ఓ సినిమా రెడీ అవుతుంది. కానీ ఆ సినిమా హిట్ అయితేనే ఆ శాఖల్లోని అందరికీ గుర్తింపు వస్తుంది. ఇండ్యువిడువల్ గా ఎవరెంత బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించినా.. సినిమా హిట్ కాకపోతే గుర్తింపు రాదు.. అలా తను ఎంత బెస్ట్ మ్యూజిక్ ఇచ్చినా సినిమాలు హిట్ కాకపోవడంతో ఇతర భాషా సినిమాల్లోకి వలస వెళ్లి అక్కడ నుంచి జాతీయ అవార్డ్ సాధించిన ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్. తెలుగు వాడైనా మళయాలీల మోస్ట్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిన విద్యాసాగర్ సంగీత ప్రస్థానాన్ని ఓ సారి గుర్తు చేసుకుందాం..

విద్యాసాగర్ పుట్టింది అమలాపురంలో. కుటుంబం అంతా సంగీతకారులే కావడంతో తన రక్తంలోనూ సంగీతం ఉందంటాడు విద్యాసాగర్. అయితే అతని చిన్నతనంలోనే తండ్రి సినిమా రంగానికి వెళ్లారు. విద్యాసాగర్ కు తండ్రే తొలి గురువు కూడా. తర్వాత వేరే మాస్టర్ వద్ద సంగీతం నేర్చుకోవడానికి వెళ్లారు. అక్కడే ఆయనకు మరో ఫ్రెండ్ దొరికాడు.. అతనే ఎఆర్ రెహ్మాన్. ఇద్దరూ కలిసి ఆ గురువు వద్ద సంగీతంలో శిక్షణ తీసుకున్నారు.

ఘోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా విద్యా సాగర్

11యేళ్ల వయసులో ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్ నుంచి వెస్టర్న్ క్లాసిక్ మ్యూజిక్ నేర్చుకుని ఇండియాకు వచ్చారు. తర్వాత తండ్రి పరిచయాలతో కెవి మహదేవన్, ఎమ్మెస్ విశ్వనాథన్, ఇళయారాజ, రాజన్ – నాగేంద్ర వంటి నాటి దిగ్గజ సంగీత దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పనిచేశాడు. ఆ టైమ్ లో ఎస్పీ కోదండపాణి వద్ద వచ్చిన ఓ చిన్న అవకాశం అతన్ని 17యేళ్లపాటు తెరవెనుకే ఉండిపోయేలా చేసింది. అన్నేళ్ల పాటు ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ కు దాదాపు 600 సినిమాలకు ఘోస్ట్ గా పనిచేశారట.
అలా ఘోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్న టైమ్ లోనే చిలిపి కృష్ణుడు అనే సినిమాకు రీ రికార్డింగ్ చేశాడు. నిజానికి ఆ సినిమాకు సంగీత దర్శకుడు ఆర్డీ బర్మన్. ఆయనకు వీలుకాకపోవడంతో తను చేశాడు. అయినా నేను కూడా ఇంత బాగా చేయలేకపోయేవాణ్నేమో అన్నారట బర్మన్.. ఆ స్థాయి ప్రతిభ ఉన్నా చిన్న అదృష్టం లేక చాలా యేళ్ల పాటు తెరవెనుకే ఉండిపోవాల్సి వచ్చింది.
సంగీత దర్శకుడిగా నిరూపించుకోవాలని ఎన్నో కలలు కన్న విద్యాసాగర్ కు ఆ తరుణం వచ్చింది. 1989లో సంగీత దర్శకుడిగా పూ మనమ్ అనే ఓ తమిళ చిత్రానికి ఛాన్స్ వచ్చింది. దానికోసం ఎంతో కష్టపడ్డా ఫలితం రాలేదు. సినిమా పోయింది. కానీ తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. ధర్మతేజ, తమ్మారెడ్డి భరద్వాజ అలజడి, తేనెటీగ, ఆమె చిత్రాలకు సంగీత దర్శకుడిగా ఇవి హిట్ అయినా మళ్లీ విద్యాసాగర్ కు అదృష్టం కలిసి రాలేదు.
నిజానికి విద్యాసాగర్ కెరీర్ ప్రారంభం నుంచీ ఇలాగే జరిగింది. ఆఫర్ వచ్చినట్టే వచ్చి చేజారిన సందర్భాలుంటే, వచ్చిన ఛాన్సుల్లో చాలా వరకూ తన వర్క్ బావున్నా సినిమా బాగాలేకపోవడం వల్లో, లేక హిట్ అయిన సినిమాల్లో ఇంకేదో బావుందనో తనకు బ్రేక్ వచ్చేది కాదు. ఆ టైమ్ లోనే మరో ఛాన్స్ తెలుగులోనే వచ్చింది. సురేష్, మీనా నటించిన అల్లరి పిల్ల సినిమా అది. ఇందులో తూరుపు సిందూరపు అనే సూపర్ హిట్ అయింది.

ముగ్గురు మొనగాళ్లుకు సంగీతం అందించిన విద్యా సాగర్

అల్లరి పిల్ల యావరేజ్ గా ఆడినా.. పరిశ్రమలో అందరూ ఎదురు చూసే కాంబినేషన్ లో అదిరిపోయే ఆఫర్ వచ్చింది విద్యాసాగర్ కు. ఆ రోజుల్లో రాఘవేంద్రరావు కాంబినేషన్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఓ రోజు రాఘవేంద్రరావే విద్యాసాగర్ తో చిరంజీవి సినిమాకు పనిచేస్తావా అని అడిగారట. మరి కాదంటాడా.. వెంటనే ఒప్పేసుకుని అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చాడు.. ఆ సినిమా ముగ్గురు మొనగాళ్లు.
బ్యాడ్ లక్ వెంటాడుతున్నప్పుడు ఏం చేసినా కలిసి రాదంటే ఇదే. ముగ్గురు మొనగాళ్లు చిత్రంలోని పాటలు ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. కానీ సినిమా యావరేజ్ గా ఆడింది. దీంతో మళ్లీ మరో బ్రేక్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. కొన్నాళ్లు వెయిట్ చేశాక, అది కూడా టాలీవుడ్ ను వదిలేశాకే విద్యాసాగర్ కు అదృష్టం మొదలైంది.
యాక్షన్ సినిమా చేసిన ఓ సంగీత దర్శకుడికి పెద్ద క్రేజ్ వచ్చిందంటే ఆశ్చర్యం కలగక మానదు. విద్యాసాగర్ విషయంలో ఇదే జరిగింది. అప్పటికే తెలుగు, తమిళంలో యాక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న అర్జున్ తనే దర్శకుడిగా మారి తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ జై హింద్. ఈ సినిమాకు సంగీతాన్నందించిన విద్యాసాగర్ తొలి బ్లాక్ బస్టర్ బ్రేక్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత తమిళంలో చాలా ఫాస్ట్ గా దూసుకపోయాడు.

మళయాలంలో విద్యా సాగర్ కు తిరుగులేని బ్రేక్

తమిళంలో వచ్చిన క్రేజ్ తో అక్కడ వరుసగా సినిమాలు చేస్తున్న టైమ్ లో విద్యాసాగర్ కెరీర్ మరో మలుపు తీసుకుంది. 1998వ సంవత్సరంలో మళయాల చిత్రం ‘అళగియ రావణన్’ చిత్రానికి సంగీతం అందించే ఛాన్స్. హీరో సూపర్ స్టార్ మమ్ముట్టి. ఆమూవీతో పాటు మ్యూజిక్ కూడా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డ్ తో పాటు మొత్తం తనొక్కడికే 12 అవార్డులు వచ్చాయి.
మళయాలంలో ఓవర్ నైట్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో వరుసగా అక్కడే అన్ని అవకాశాలూ వచ్చాయి. అలా 2000,2002 సంవత్సరాల్లో కేరళ ప్రభుత్వ అవార్డులు అందుకున్నాడు. తర్వాత తమిళంలోనూ 2001లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ అందుకున్నాడు. అయితే తెలుగులో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవాలన్న కల మాత్రం తీరలేదు..
ఇక విద్యాసాగర్ ను సౌత్ లో తిరుగులేని సంగీత దర్శకుణ్ని చేసింది చంద్రముఖి. రారా సరసకు రారా అంటూ తను కంపోజ్ చేసిన పాట రజినికాంత్ కే ఫేవరెట్ సాంగ్ అయిపోయింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు పాటలన్నీ అలరించాయి.. ఈ సినిమా తర్వాత తనకు హిట్ ఫ్లాపులకు సంబంధించిన పట్టింపులు పోయాయంటాడు విద్యాసాగర్.
జాతీయ అవార్డ్.. ఈ టైటిల్ కు ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలుసు. అందుకే నేషనల్ అవార్డ్ అందుకున్నవారు ఏ భాష వారైనా ఆసక్తిగా చూస్తాం. కానీ మనోడే అయినా మనవాళ్లు పట్టించుకోని విద్యాసాగర్ కు చివరికి తెలుగు సినిమాతోనే నేషనల్ అవార్డ్ రావడం విశేషం. చాలాయేళ్లుగా కె విశ్వనాథ్ తో పనిచేయాలనుకున్న తన కల నెరవేరడంతో విద్యాసాగర్ కు బోనస్ జాతీయ అవార్డ్ ను అందించిన ఆ సినిమా స్వరాభిషేకం.

కే.విశ్వనాథ్ మూవీస్ విద్యా సాగర్ కు మళ్లీ

కె విశ్వనాథ్ రూపొందించిన సప్తపది, శంకరాభరణం చిత్రాలకు సంగీత దర్శకుడు కెవి మహదేవన్ శిష్యుడిగా ఈ మూవీస్ కు రీరికార్డింగ్ చేసిన తను తర్వాత విశ్వనాథ్ సినిమాకే పనిచేసి జాతీయ అవార్డ్ అందుకోవడం ఆనందం అంటాడు విద్యాసాగర్. అలాగే తన మరో ఫేవరెట్ డైరెక్టర్ బాపుతోనూ పనిచేసిన సంతృప్తిని మిగుల్చుకున్నాడు. బాపు తీసిన సుందరకాండకు మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగరే.
విద్యాసాగర్ సంగీతంలో ఇటు శాస్త్రీయం, అటు వెస్ట్రన్ రెండూ ఉంటాయి. సందర్భాన్ని ఈ రెండూ మిక్స్ చేసి అందించిన పాటలూ ఉన్నాయి. ఏదేమైనా విద్యాసాగర్ లాంటి అత్యంత ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడు మన దగ్గర కాకుండా మరో భాషలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం అతని దురదృష్టమే తప్ప మరేమీ కాదు.. మరి ఇకనైనా విద్యాసాగర్ కు ఇక్కడ మరిన్ని మంచి సినిమాలు రావాలని, అవన్నీ హిట్ కావాలని కోరుకుందాం..

Continue reading
అభినవ సావిత్రి సౌందర్య జయంతి స్పెషల్

సౌందర్య.. తెలుగుతెరపై ఈ పేరు ఒక చెరగని సంతకం. అందం, అభినయం కలబోసిన అద్భుతం ఆ పేరు. ఒక తరం మహిళా ప్రేక్షకులను ప్రభావితం చేసిన సౌందర్య.. మహానటి సావిత్రి తర్వాత ఆ స్థాయి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. చిలిపిదనం నిండి ఉన్న పాత్రలతో పరిచయమై.. ఆ తర్వాత దక్షిణాది సినిమాకే ఆప్తమిత్రురాలిగా మారిపోయింది. దశాబ్ధానికి పైగా తన నట వైదుష్యంతో ప్రేక్షకులను సమ్మోహనపరచిన ఆ సౌందర్యం అకాస్మాత్తుగా మాయమైనా.. ఆ నటన, ఆ ప్రతిభ అజరామరం. ఈ నెల 18న సౌందర్య జయంతి సందర్భంగా ఆమెకు సంబంధించిన సినీ విశేషాలతో ఈ స్పెషల్ ఆర్టికల్.

మహానటి సావిత్రి తర్వాత.. ఆ బిరుదుకు అర్థాన్నిచ్చిన నటి సౌందర్య. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం సౌందర్యకు వెన్నతో పెట్టిన విద్య. ఈ క్వాలిటీతోనే అగ్రహీరోలందరి సరసనా నటించి.. అభినవ సావిత్రిగా పేరు తెచ్చుకుంది. సావిత్రి తర్వాత తిరుగులేని మహిళాభిమానుల్ని సంపాదించుకున్న నటి కూడా సౌందర్యే. అందాల ప్రదర్శనకు ఆమడదూరం నిలిచి.. సహజ సౌందర్యం ఆభరణంగా పరిపూర్ణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి సౌందర్య.

గ్లామర్ పాత్రలకు దూరంగా సౌందర్య

చారడేసి కళ్లు, గులాబీ చెక్కిళ్లు.. చెక్కుచెదరని చిరునవ్వు.. చూడగానే ఆకట్టుకునే నిలువెత్తు రూపం కలిపేస్తే కనిపించే రూపం సౌందర్య. నాజూకైన అందం … అసాధారణమైన అభినయం … అంతకు మించిన వ్యక్తిత్వం సౌందర్యకు ఆభరణాలు.. సిల్వర్ స్క్రీన్ పై ఈ అందాలబొమ్మ కనిపించగానే ప్రేక్షకుల హృదయం ఆనందంతో పొంగిపోయింది. తీరైన కట్టుబొట్టుతో పుత్తడి కాంతుల మెరుపులతో.. చూడచక్కని నటనతో లక్షలాది మంది తెలుగు అభిమానులను సంపాదింకుంది సౌందర్య. ఓ దశలో సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా వెలుగొంది.. తెలుగు వారి మనసుల్లో ఎన్నటికీ చెరగని స్థానం సంపాదించుకుంది.
సౌందర్య పరిశ్రమలోకి వచ్చే టైమ్ కు ఇక్కడంతా గ్లామర్ నాయికల హవా నడుస్తోంది. హీరోయిన్ అంటే ఎక్కువగా అందాల ప్రదర్శనకే పరిమితమైన పీరియడ్ అది. అలాంటి సందర్భంలో ఎంట్రీ ఇచ్చినా ఎన్నడూ కాంప్రమైజ్ కాలేదు. తెలుగులో రైతు భారతం తన ఫస్ట్ సినిమా. కానీ మనవరాలి పెళ్లి ముందుగా విడుదలైంది. అయితే గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం రాజేంద్రుడు గజేంద్రుడు.
చూడగానే ఆకట్టుకునే రూపం కావడంతో తొలి మలి సినిమాలు పెద్ద విజయాలు సాధించకపోయినా ఆఫర్స్ వెల్లువెత్తాయి. వరుసగా నంబర్ వన్, మాయలోడు, మేడమ్, టాప్ హీరో, అల్లరి ప్రేమికుడు, అమ్మదొంగ వంటి సినిమాలు చేసేసింది. ఈ సినిమాలు అప్పట్లో సౌందర్యకి తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టాయి. అయితే అక్కినేని నాగార్జున హీరోగా ఈవివి సత్యనారాయణ తెరకెక్కించిన హలో బ్రదర్ తో తొలి భారీ హిట్ ను అందుకొన్నది.. ఈ సినిమాలో సౌందర్య నటన తో పాటు గ్లామర్ కు కూడా జనం ఫిదా అయిపోయారు.

అమ్మోరుతో అద్భుతమైన గుర్తింపు

1995లో కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అమ్మోరు స్పెషల్ ఇమేజ్ ను తెచ్చింది. తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా, మహిళా ప్రేక్షకుల్లో సౌందర్యపై అభిమానం పెరగడానికి కారణం అమ్మోరు చిత్రమే. ఈ మూవీలో సౌందర్య బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అమ్మోరులో సౌందర్య నటనకు తొలి నంది అవార్డ్ తో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా దాసోహయ్యాయి. ఈ సినిమా తర్వాత తనికి వెను తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు.
సౌందర్య చేసే సినిమాల్లో ఆమె పాత్రలు స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించాయి. ఏ పాత్ర చేసినా తనే పాత్రగా మారడం తన శైలి. అందుకే పెదరాయుడు వంటి సినిమాలో చిన్న పాత్రలోనూ పెద్ద ఇంపాక్ట్ వేయగలిగింది. పెదరాయుడు సినిమాలో సౌందర్య పాత్ర టూ షేడ్స్ లో నడుస్తుంది. పొగరుబోతు కోడలుగానూ…అత్తింటి ఔన్నత్యాన్ని అర్ధం చేసుకున్న గృహిణిగానూ రెండు విభిన్న ధోరణుల్నీ అద్భుతంగా నటించి మెప్పించింది.

తక్కువ టైమ్ లో స్టార్ హీరోయిన్ గా సౌందర్య

అతి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సౌందర్య. అయితే అప్పటి హీరోయిన్లలో ఉన్న బెస్ట్ క్లాలిటీ ఏంటంటే.. హీరోల స్టార్గమ్ కంటే కథలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, జగపతిబాబు వంటి హీరోలతో పాటు జెడి చక్రవర్తి, వినోద్ కుమార్, నరేష్, సురేష్, వినీత్ వంటి స్మాల్ స్టార్స్ తో నూ నటించింది. ముఖ్యంగా జగపతిబాబుతో తనది బెస్ట్ పెయిర్ అంటారు. ఈ జంట అంత సహజంగా ఉండేది.
అమాయకత్వం నిండిన పాత్రలైనా.. ఆత్మవిశ్వాసం మెండైన పాత్రలైనా.. ఇట్టే ఒదిగిపోతుంది సౌందర్య. దొంగాట సినిమాలో అమాయకురాలైన పల్లెటూరి అమ్మాయిగా, అంతపురంలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న యువతిగా సౌందర్య నటనకు ఫిదా కానివారెవ్వరు.. ఈ కారణంగానే సౌందర్య ఉంటే సినిమా హిట్.. అనే సెంటిమెంట్ బలంగా ఉండేది ఆ టైమ్ లో. అలాగే హీరోలు సైతం సౌందర్య డేట్స్ కు అనుగుణంగా తమ డేట్స్ అడ్జెస్ట్ చేసుకున్న రేంజ్ తనది.

సౌందర్య – వెంకటేష్ స్పెషల్ మూవీస్

సౌందర్య, వెంకటేష్ జోడీకి పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్సే. తను టాప్ పొజిషన్ లో ఉండగానే వెంకటేష్ తో చేసిన పెళ్లి చేసుకుందాం సినమాలో తనది సాహసోపేతమైన పాత్ర. లైంగిక దాడి బాధితురాలిగా ఆ స్థాయి హీరోయిన్ నటించడం ఊహించం. కానీ తను పాత్రను ప్రేమించింది. అలాగే అంతకు ముందే వెంకటేష్ తో చేసిన పవిత్రబంధంలో తన నటన ముందు వెంకటేష్ సైతం తేలిపోయాడంటే అతిశయోక్తి కాదు.
ఆర్టిస్ట్ అంటే చాలెంజింగ్ రోల్స్ వస్తే వదలకూడదు. కానీ చాలామంది ఇమేజ్ కు ఇబ్బంది అవుతుందేమో అని అలాంటి పాత్రలు వదులుకుంటారు. కానీ సౌందర్య మాత్రం కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే లైంగిక దాడి బాధితురాలిగా నటించేందుకు ఒప్పుకుని ఆశ్చర్యపరిచింది. పెళ్లి చేసుకుందాం సినిమాలో ఈ పాత్ర చేసి ప్రేక్షకులతోనే కాదు.. పరిశ్రమలోనూ ప్రతి ఒక్కరి చేతా శెభాష్ అనిపించుకుంది.
వెంకటేష్ తో సౌందర్యది బ్లాక్ బస్టర్ పెయిర్. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారంటే సినిమా హిట్టే. పవిత్ర బంధం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పెళ్ళి చేసుకుందాం, రాజా, జయం మనదేరా, దేవిపుత్రుడు వంటి సినిమాలు వీరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు. దేవీపుత్రుడు తప్ప మిగతావన్నీ బ్లాక్ బస్టర్సే.

బాబు మోహన్, అలీతోనూ స్పెషల్ సాంగ్స్ చేసిన సౌందర్య

సౌందర్య దర్శకుల నటి. మంచి పాత్రైతే చాలు.. వెంటనే ఒప్పుకుంటుంది. అలాగే దర్శకుల కోసం ఇమేజ్ నూ పక్కనబెట్టగల పెద్ద మనసూ ఉంది. అందుకే బాబూ మోహన్, అలీ వంటి కమెడియన్స్ తో కూడా డ్యూయొట్ చేయగలిగింది. ఆ సినిమాల్లో హీరో వేరే. కానీ సిట్యుయేషన్ కోసం దర్శకుల మాట వినడం తన ధర్మం అని ఫీలవడం వల్లే ఆ పాటలు చేసింది.
పరిశ్రమలో లైట్ బాయ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరినీ ఆదుకునే మనిషిగా సౌందర్యకి పేరు ఉంది. వీటన్నింటి మూలంగా పరిశ్రమలోనే కాక అభిమానుల హృదయాలలోనూ తిరుగులేని తరిగిపోని అభిమానాన్ని సంపాదించుకుంది సౌందర్య. దక్షిణాదిలోని అన్ని భాషల్లో టాప్ హీరోలతో నటించినా.. తను టాప్ హీరోయిన్ అన్న అహం దరిచేరనివ్వని అరుదైన అభినేత్రి సౌందర్య. అందుకే ఆమెను తెలుగువారు తమ ఆడపడుచుగానే చూశారు.. జూనియర్ సావిత్రిగా కొనియాడారు.

2001 నుంచి తగ్గిన సౌందర్య దూకుడు

1994నుంచి 2001 వరకూ సౌందర్యది కెరీర్ పరంగా పీక్ స్టేజ్. యేడాదికి అన్ని భాషల్లో కలిపి పది సినిమాల వరకూ విడుదలయ్యేవంటే తనెంత మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్టో అర్థం చేసుకోవచ్చు. అయితే నటిగా శిఖరాలను చూసిన సౌందర్య కెరీర్లో 2001తర్వాత విజయాల సంఖ్య మరీ తగ్గిపోయింది. అయినా ఆమె స్థానం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు.
ఒక నటి కెరీర్ లో ఎన్ని వైవిధ్యమైన సినిమాలు చేయొచ్చో అన్నీ చేసిన నటి సౌందర్య. తనలాగా అన్ని డిఫరెంట్ మూవీస్ చేసిన హీరోయిన్ ఆ తర్వాత మనకు లేరంటే అతిశయోక్తి కాదు. 9నెలలు, అరుంధతి వంటి సబ్జెక్ట్ ఓరియంటెడ్ సినిమాలతో పాటు నా మనసిస్తారా, ఎదరులేని మనిషి వంటి సినిమాల్లో నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలూ చేసింది. తెలుగులో సౌందర్య చేసిన చివరి సినిమా మోహన్ బాబు హీరోగా నటించిన శివ్ శంకర్.

నిర్మాతగా సౌందర్య

2002లో సినిమాలు బాగా తగ్గిన తర్వాత సౌందర్ నిర్మాతగా మారింది. ద్వీప అనే కన్నడ సినిమాను నిర్మించింది. గిరీష్ కాసరవల్లి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిలిమ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ లో జాతీయ అవార్డులు, నాటులు కర్ణాటక ప్రభుత్వ అవార్డులు వచ్చాయి. అలాగే మూడు ఫిలిమ్ ఫేర్ పురస్కారాలూ లభించాయి.

సౌందర్య మరణం ఊహించనిది

నటిగా సౌందర్య స్థానం భర్తీ చేయలేనిది. తనలాంటి మరో నటిని మనం దక్షిణాదిలోనే ఇంత వరకూ చూడలేదు. పెళ్లి తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరింది సౌందర్య. ఆపార్టీ తరఫున హెలీకాప్టర్ లో ప్రచారానికి బయలుదేరింది. కానీ ఆ ప్రయాణం టేకాఫ్ కావడానికి ముందే తన లైఫ్ ఎండ్ అయింది. హెలీకాప్టర్ కూలిపోయి ఆ అభినయ సౌందర్యం మంటల్లో ఆహూతి అయిపోయింది. లక్షలాది మంది అభిమానుల కన్నీటి సాక్షిగా ఆ సౌందర్యం శాశ్వతంగా కనుమరుగైంది. ఆమె లేకపోయినా అత్భుతమైన పాత్రలతో నిరంతరం లక్షలాది అభిమానులను గుర్తు చేసుకుంటూనే ఉంటారు సౌందర్యను.

 

  • K.Y.B

Continue reading
కొరియన్ కనకరాజు టీజర్ అదిరిందిగా..

వరుణ్ తేజ్ హీరోగా నటించిన మూవీ కొరియన్ కనకరాజు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించిని ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకుడు. ఈ సినిమా చాలా రోజుల క్రితమే పూర్తయింది. అయితే ఓటిటి, శాటిలైట్ రైట్స్ ఇంకా పూర్తి కాలేదు అనే కారణంతో ఇప్పటి వరకు ఆగారు. ఫైనల్ గా ఆ రైట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. దీంతో మూవీని ఆగస్ట్ 7న విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. తాజాగా కొరియన్ కనకరాజు మూవీ టీజర్ విడుదల చేశారు.
కొరియన్ కనకరాజు అనే టైటిలే బాగా ఆకట్టుకుంటుంది. ఇక టీజర్ కు అందుకు భిన్నంగా మొదలై.. ఆ టైటిల్ కు తగ్గట్టుగా ఉండేలా టీజర్ ఎండ్ చేశారు. పెనుగొండ అనే ఊరిలో ఉండే కనకరాజు.. ఆవారాగా ఉంటాడు. ఎప్పుడూ మందు, చిందులు, ఊర్లో గొడవలు అంటూ ఉంటుంటాడు. అలాంటి అతని ఊరికి ఓ అమ్మాయి వస్తుంది. తను కొరియన్ లో ఏదో మాట్లాడుతుంది. కట్ చేస్తే అదే భాషలో కనకరాజు కూడా మాట్లాడ్డం మొదలు పెడతాడు. అంతే కాదు అతనికి ఏకంగా మాయలు కూడా మొదలవుతాయి. మొదట్లో అతని ఫ్రెండ్ క్యాజువల్ గా తీసుకుంటాడు. కానీ అతనికి సీరియస్ గానే కొన్ని మాయలు వస్తుంటాయి. దాని కారణంగా అతను కాస్త బీస్ట్ మోడ్ లోకి వెళ్లిపోతాడు. అలాగే టీజర్ లో కనకరాజును పరిచయం చేస్తున్నప్పుడు అన్నీ కొరియన్ విజువల్స్ వస్తుంటాయి. మరి వాటి వెనక ఉన్న కారణం ఏంటీ.. నిజంగానే అతనికి కొరియన్ దెయ్యం పడుతుందా.. పడితే ఆ దెయ్యం కనకరాజును ఎందుకు సెలెక్ట్ చేసుకుంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
టీజర్ మాత్రం సింపుల్ గా చాలా బావుందని చెప్పాలి. మాస్ అండ్ క్లాస్ తో పాటు కామెడీ హారర్ ఎలిమెంట్స్ కూడా ఈ మూవీలో పుష్కలంగా ఉండబోతున్నాయి అనిపించేలా ఉంది టీజర్ కట్. టీజర్ తోనే ఆకట్టుకున్నారంటే తర్వాత ట్రైలర్.. ఆపై మూవీతో మంచి విజయం కూడా అందుకోబోతున్నారు అనిపించేలా ఉంది.
ఇక వరుణ్ తేజ్ కనకరాజుగా అతని ఫ్రెండ్ సత్య కనిపిస్తున్నారు. హీరోయిన్ రితికా నాయక్ కు ఇది ఓ మంచి అవకాశం అనేలా ఉంది. ఏదేమైనా టీజర్ మాత్రం చాలా బావుందనే చెప్పాలి. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

Continue reading
100 కోట్ల క్లబ్‌లో చేరిన సమంత

దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ విజయంతో సమంత కెరీర్‌లో మరో కీలక మైలురాయి చేరిందని చెప్పాలి.
గత కొంతకాలంగా కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టిన సమంత, ‘మా ఇంటి బంగారం’తో మరోసారి తన మార్కెట్‌ను నిరూపించుకుంది. సినిమాలో ఆమె నటన, భావోద్వేగ సన్నివేశాలు, పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా విడుదలైన తొలి రోజు నుంచే మంచి ఓపెనింగ్స్ అందుకుంది. వీకెండ్‌లో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా మంచి స్పందన రావడంతో భారీ వసూళ్లు సాధించింది. వీకెండ్స్ తో పాటు వీక్ డేస్ లో కూడా మంచి కలెక్షన్స్ కంటిన్యూ అయ్యాయి. అదే ఊపును కొనసాగిస్తూ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంది మా ఇంటి బంగారం.
ఈ విజయం సమంతకు వ్యక్తిగతంగానే కాకుండా కెరీర్ పరంగా కూడా ఎంతో కీలకం అని చెప్పాలి. మహిళా ప్రధాన పాత్రలతో కూడా భారీ వసూళ్లు సాధించవచ్చని మరోసారి ఈ సినిమా నిరూపించిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో సమంత అభిమానులు ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ #100CroreClub, #MaaIntiBangaram వంటి హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్నారు. ఈ విజయంతో సమంత మరోసారి టాలీవుడ్‌లో తన స్టార్‌డమ్‌ సత్తాను చాటుకుందని చాలామంది చెబుతున్నారు.

Continue reading
ఘట్టమనేని జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్ రివ్యూ

ఘట్టమనేని కుటుంబం నుంచి హీరోగా పరిచయం అవుతున్న జయకృష్ణ నటిస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ట్రైలర్‌ను చూస్తే ఇది కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా, యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ అంశాలు కలిసిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది. ఈ చిత్రం జయకృష్ణతో పాటు రాశా తడానీకి కూడా తెలుగు సినీ పరిశ్రమలో తొలి సినిమా కావడం విశేషం.
ట్రైలర్ ప్రారంభం నుంచే గ్రామీణ వాతావరణాన్ని అందంగా చూపించారు. ప్రేమ కథతో మొదలైన కథనం, ఆ తర్వాత యాక్షన్ మోడ్‌లోకి వెళ్లడం ఆసక్తిని పెంచుతుంది. దర్శకుడు అజయ్ భూపతి తనకు అలవాటైన స్టైల్‌లో ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్‌ను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించినట్లు అనిపిస్తోంది.
డెబ్యూ హీరో అయినప్పటికీ జయకృష్ణ స్క్రీన్‌పై కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. యాక్షన్ షాట్స్‌లో మంచి ఎనర్జీ కనిపించగా, ఎమోషనల్ సీన్స్‌లో కూడా తనవంతు ప్రయత్నం చేశాడు. ఇంకా సినిమా విడుదలైన తర్వాతే పూర్తి స్థాయి నటనపై స్పష్టత వస్తుంది. అయితే ట్రైలర్ మాత్రం హీరోపై మంచి అంచనాలను పెంచింది.
సినిమాటోగ్రఫీ ట్రైలర్‌కు పెద్ద ప్లస్‌గా నిలిచింది. విజువల్స్ రిచ్‌గా కనిపిస్తున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సన్నివేశాలకు బాగా సెట్ అయింది. నిర్మాణ విలువలు కూడా మంచి స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా చూస్తే ‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. జయకృష్ణకు హీరోగా మంచి లాంచ్ ఇవ్వగలిగే అంశాలు ఇందులో కనిపిస్తున్నాయి. అయితే ట్రైలర్ ఇచ్చిన హైప్‌ను సినిమా ఎంతవరకు నిలబెట్టుకుంటుందో విడుదల తర్వాతే తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ చిత్రం యువ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచిందని చెప్పొచ్చు.

 

Continue reading