24శాఖలు ఎంతో కష్టపడితేనే ఓ సినిమా రెడీ అవుతుంది. కానీ ఆ సినిమా హిట్ అయితేనే ఆ శాఖల్లోని అందరికీ గుర్తింపు వస్తుంది. ఇండ్యువిడువల్ గా ఎవరెంత బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించినా.. సినిమా హిట్ కాకపోతే గుర్తింపు రాదు.. అలా తను ఎంత బెస్ట్ మ్యూజిక్ ఇచ్చినా సినిమాలు హిట్ కాకపోవడంతో ఇతర భాషా సినిమాల్లోకి వలస వెళ్లి అక్కడ నుంచి జాతీయ అవార్డ్ సాధించిన ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్. తెలుగు వాడైనా మళయాలీల మోస్ట్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిన విద్యాసాగర్ సంగీత ప్రస్థానాన్ని ఓ సారి గుర్తు చేసుకుందాం..

విద్యాసాగర్ పుట్టింది అమలాపురంలో. కుటుంబం అంతా సంగీతకారులే కావడంతో తన రక్తంలోనూ సంగీతం ఉందంటాడు విద్యాసాగర్. అయితే అతని చిన్నతనంలోనే తండ్రి సినిమా రంగానికి వెళ్లారు. విద్యాసాగర్ కు తండ్రే తొలి గురువు కూడా. తర్వాత వేరే మాస్టర్ వద్ద సంగీతం నేర్చుకోవడానికి వెళ్లారు. అక్కడే ఆయనకు మరో ఫ్రెండ్ దొరికాడు.. అతనే ఎఆర్ రెహ్మాన్. ఇద్దరూ కలిసి ఆ గురువు వద్ద సంగీతంలో శిక్షణ తీసుకున్నారు.

ఘోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా విద్యా సాగర్

11యేళ్ల వయసులో ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్ నుంచి వెస్టర్న్ క్లాసిక్ మ్యూజిక్ నేర్చుకుని ఇండియాకు వచ్చారు. తర్వాత తండ్రి పరిచయాలతో కెవి మహదేవన్, ఎమ్మెస్ విశ్వనాథన్, ఇళయారాజ, రాజన్ – నాగేంద్ర వంటి నాటి దిగ్గజ సంగీత దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పనిచేశాడు. ఆ టైమ్ లో ఎస్పీ కోదండపాణి వద్ద వచ్చిన ఓ చిన్న అవకాశం అతన్ని 17యేళ్లపాటు తెరవెనుకే ఉండిపోయేలా చేసింది. అన్నేళ్ల పాటు ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ కు దాదాపు 600 సినిమాలకు ఘోస్ట్ గా పనిచేశారట.
అలా ఘోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్న టైమ్ లోనే చిలిపి కృష్ణుడు అనే సినిమాకు రీ రికార్డింగ్ చేశాడు. నిజానికి ఆ సినిమాకు సంగీత దర్శకుడు ఆర్డీ బర్మన్. ఆయనకు వీలుకాకపోవడంతో తను చేశాడు. అయినా నేను కూడా ఇంత బాగా చేయలేకపోయేవాణ్నేమో అన్నారట బర్మన్.. ఆ స్థాయి ప్రతిభ ఉన్నా చిన్న అదృష్టం లేక చాలా యేళ్ల పాటు తెరవెనుకే ఉండిపోవాల్సి వచ్చింది.
సంగీత దర్శకుడిగా నిరూపించుకోవాలని ఎన్నో కలలు కన్న విద్యాసాగర్ కు ఆ తరుణం వచ్చింది. 1989లో సంగీత దర్శకుడిగా పూ మనమ్ అనే ఓ తమిళ చిత్రానికి ఛాన్స్ వచ్చింది. దానికోసం ఎంతో కష్టపడ్డా ఫలితం రాలేదు. సినిమా పోయింది. కానీ తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. ధర్మతేజ, తమ్మారెడ్డి భరద్వాజ అలజడి, తేనెటీగ, ఆమె చిత్రాలకు సంగీత దర్శకుడిగా ఇవి హిట్ అయినా మళ్లీ విద్యాసాగర్ కు అదృష్టం కలిసి రాలేదు.
నిజానికి విద్యాసాగర్ కెరీర్ ప్రారంభం నుంచీ ఇలాగే జరిగింది. ఆఫర్ వచ్చినట్టే వచ్చి చేజారిన సందర్భాలుంటే, వచ్చిన ఛాన్సుల్లో చాలా వరకూ తన వర్క్ బావున్నా సినిమా బాగాలేకపోవడం వల్లో, లేక హిట్ అయిన సినిమాల్లో ఇంకేదో బావుందనో తనకు బ్రేక్ వచ్చేది కాదు. ఆ టైమ్ లోనే మరో ఛాన్స్ తెలుగులోనే వచ్చింది. సురేష్, మీనా నటించిన అల్లరి పిల్ల సినిమా అది. ఇందులో తూరుపు సిందూరపు అనే సూపర్ హిట్ అయింది.

ముగ్గురు మొనగాళ్లుకు సంగీతం అందించిన విద్యా సాగర్

అల్లరి పిల్ల యావరేజ్ గా ఆడినా.. పరిశ్రమలో అందరూ ఎదురు చూసే కాంబినేషన్ లో అదిరిపోయే ఆఫర్ వచ్చింది విద్యాసాగర్ కు. ఆ రోజుల్లో రాఘవేంద్రరావు కాంబినేషన్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఓ రోజు రాఘవేంద్రరావే విద్యాసాగర్ తో చిరంజీవి సినిమాకు పనిచేస్తావా అని అడిగారట. మరి కాదంటాడా.. వెంటనే ఒప్పేసుకుని అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చాడు.. ఆ సినిమా ముగ్గురు మొనగాళ్లు.
బ్యాడ్ లక్ వెంటాడుతున్నప్పుడు ఏం చేసినా కలిసి రాదంటే ఇదే. ముగ్గురు మొనగాళ్లు చిత్రంలోని పాటలు ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. కానీ సినిమా యావరేజ్ గా ఆడింది. దీంతో మళ్లీ మరో బ్రేక్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. కొన్నాళ్లు వెయిట్ చేశాక, అది కూడా టాలీవుడ్ ను వదిలేశాకే విద్యాసాగర్ కు అదృష్టం మొదలైంది.
యాక్షన్ సినిమా చేసిన ఓ సంగీత దర్శకుడికి పెద్ద క్రేజ్ వచ్చిందంటే ఆశ్చర్యం కలగక మానదు. విద్యాసాగర్ విషయంలో ఇదే జరిగింది. అప్పటికే తెలుగు, తమిళంలో యాక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న అర్జున్ తనే దర్శకుడిగా మారి తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ జై హింద్. ఈ సినిమాకు సంగీతాన్నందించిన విద్యాసాగర్ తొలి బ్లాక్ బస్టర్ బ్రేక్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత తమిళంలో చాలా ఫాస్ట్ గా దూసుకపోయాడు.

మళయాలంలో విద్యా సాగర్ కు తిరుగులేని బ్రేక్

తమిళంలో వచ్చిన క్రేజ్ తో అక్కడ వరుసగా సినిమాలు చేస్తున్న టైమ్ లో విద్యాసాగర్ కెరీర్ మరో మలుపు తీసుకుంది. 1998వ సంవత్సరంలో మళయాల చిత్రం ‘అళగియ రావణన్’ చిత్రానికి సంగీతం అందించే ఛాన్స్. హీరో సూపర్ స్టార్ మమ్ముట్టి. ఆమూవీతో పాటు మ్యూజిక్ కూడా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డ్ తో పాటు మొత్తం తనొక్కడికే 12 అవార్డులు వచ్చాయి.
మళయాలంలో ఓవర్ నైట్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో వరుసగా అక్కడే అన్ని అవకాశాలూ వచ్చాయి. అలా 2000,2002 సంవత్సరాల్లో కేరళ ప్రభుత్వ అవార్డులు అందుకున్నాడు. తర్వాత తమిళంలోనూ 2001లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ అందుకున్నాడు. అయితే తెలుగులో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవాలన్న కల మాత్రం తీరలేదు..
ఇక విద్యాసాగర్ ను సౌత్ లో తిరుగులేని సంగీత దర్శకుణ్ని చేసింది చంద్రముఖి. రారా సరసకు రారా అంటూ తను కంపోజ్ చేసిన పాట రజినికాంత్ కే ఫేవరెట్ సాంగ్ అయిపోయింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు పాటలన్నీ అలరించాయి.. ఈ సినిమా తర్వాత తనకు హిట్ ఫ్లాపులకు సంబంధించిన పట్టింపులు పోయాయంటాడు విద్యాసాగర్.
జాతీయ అవార్డ్.. ఈ టైటిల్ కు ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలుసు. అందుకే నేషనల్ అవార్డ్ అందుకున్నవారు ఏ భాష వారైనా ఆసక్తిగా చూస్తాం. కానీ మనోడే అయినా మనవాళ్లు పట్టించుకోని విద్యాసాగర్ కు చివరికి తెలుగు సినిమాతోనే నేషనల్ అవార్డ్ రావడం విశేషం. చాలాయేళ్లుగా కె విశ్వనాథ్ తో పనిచేయాలనుకున్న తన కల నెరవేరడంతో విద్యాసాగర్ కు బోనస్ జాతీయ అవార్డ్ ను అందించిన ఆ సినిమా స్వరాభిషేకం.

కే.విశ్వనాథ్ మూవీస్ విద్యా సాగర్ కు మళ్లీ

కె విశ్వనాథ్ రూపొందించిన సప్తపది, శంకరాభరణం చిత్రాలకు సంగీత దర్శకుడు కెవి మహదేవన్ శిష్యుడిగా ఈ మూవీస్ కు రీరికార్డింగ్ చేసిన తను తర్వాత విశ్వనాథ్ సినిమాకే పనిచేసి జాతీయ అవార్డ్ అందుకోవడం ఆనందం అంటాడు విద్యాసాగర్. అలాగే తన మరో ఫేవరెట్ డైరెక్టర్ బాపుతోనూ పనిచేసిన సంతృప్తిని మిగుల్చుకున్నాడు. బాపు తీసిన సుందరకాండకు మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగరే.
విద్యాసాగర్ సంగీతంలో ఇటు శాస్త్రీయం, అటు వెస్ట్రన్ రెండూ ఉంటాయి. సందర్భాన్ని ఈ రెండూ మిక్స్ చేసి అందించిన పాటలూ ఉన్నాయి. ఏదేమైనా విద్యాసాగర్ లాంటి అత్యంత ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడు మన దగ్గర కాకుండా మరో భాషలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం అతని దురదృష్టమే తప్ప మరేమీ కాదు.. మరి ఇకనైనా విద్యాసాగర్ కు ఇక్కడ మరిన్ని మంచి సినిమాలు రావాలని, అవన్నీ హిట్ కావాలని కోరుకుందాం..