మేరు నటధీరుడు ఎస్వీ రంగారావు

నటనకు నిర్వచనం, పర్యాయపదం అంటూ ఉంటే ఆ పదం పేరు ఎస్.వి. రంగారావు. ఒక నటుడి పేరు చెబితే పాత్రల గురించి మాట్లాడ్డం.. పాత్రల పేర్లు చెబితే ఇది రంగారావు తప్ప.. లేదా రంగారావులా మరెవరూ చేయలేరు అనుకోవడం బహుశా ప్రపంచ సినిమా చరిత్రలో ఒక్క ఎస్వీ రంగారావుకు మాత్రమే సాధ్యమైన విషయం అనిపిస్తుంది. ఆయన నటనకు పాత్రలే పరివశించిపోయాయి. అహంకారం నుంచి ఘీంకారం వరకూ.. ఆప్యాయతల నుంచి అసూయల వరకూ ఆ కళ్లలో పలకని భావం లేదు.. అలాంటి ఘనత సాధించిన ఎస్వీ రంగారావు అనబడే సామర్లకోట వెంకట రంగారావు జయంతి (03.07.2026) సందర్భంగా ఆయన గురించిన విశేషాలను ఓ సారి గుర్తు చేసుకుందాం.

జానపదం, పౌరాణికం, సాంఘికం, చారిత్రకం.. ఇలా ఎలాంటి పాత్రలోనైనా అలవోకగా పరకాయ ప్రవేశం చేయగల మేటి నటుడు ఎస్వీ రంగారావు. మన పౌరాణిక పాత్రలకు ఆయనలా జీవం పోసిన నటుడు మరొకరు లేరు. ఇప్పటికీ ఘటోత్కచుడు, దుర్యోధనుడు, రావణబ్రహ్మ పాత్రలను ఆయనంత ఎనర్జిటిక్ గా పోషించగల నటుడు పుట్టలేదు. అందుకు ఆయన చేసిన ఎన్నో పౌరాణిక పాత్రలే నిదర్శనం. పాత్ర స్వభావాన్ని, భావాన్ని.. కళ్లలోనూ.. శరీరంతోనూ ఏకకాలంలో పలికించిన మేరునటధీరుడు ఎస్వీ రంగారావు.
ఎస్వీ రంగారావు.. అనితర సాధ్యమైన నటనా వైదుష్యాన్ని ప్రదర్శించటంలో మహానటుడు. సంస్కృత పద భూయిష్టమైన సమాసాలతో కూడిన సంభాషణలను అర్థం చేసుకొని, అవలీలగా పలికిన స్వరభాషణుడు. సంభాషణలు పలకటంలో ఆ స్వరం ఓ మాయాజాలం. స్వరం తగ్గించి, సంభాషణలో, భావ వ్యక్తీకరణలో ఎవరికీ సాధ్యం కాని ఒకానొక ఒడుపు ప్రదర్శించటం ఒక్క ఎస్వీ రంగారావుకే సాధ్యం. ఎస్వీ రంగారావు తెరమీద నటవిశ్వరూపం ప్రదర్శిస్తుంటే ఇతరులెవరూ కనబడరనేది సత్యం.
బానిసలకింత అహంకారమా.. అంటూ ఎస్వీఆర్ ఘీంకరిస్తే ఆ నటనకు ప్రేక్షకులంతా బానిసలైపోయారు. సాహసం శాయరా డింభకా అని ఆదేశిస్తే హైహై నాయకా అనేశారు. ఇక పౌరాణికాల్లో భక్త ప్రహ్లాద ఆయన ప్రతిభకు ఓ మెచ్చుతునక. శ్రీహరిని ద్వేషించే దానవరాజుగా ఆయన నటన అనన్య సామాన్యం. నిజానికి ప్రహ్లాదుడిపై ప్రేక్షకుల్లో అంత సానుభూతి కలగడానికి కారణం ఎస్వీఆర్ కఠినమైన విలనీయే.
పౌరాణికాల్లో ఎస్వీఆర్ ను రీప్లేస్ చేసే నటుడు ఇంత వరకూ పుట్టలేదు.. పుడతాడనీ చెప్పలేం. అలాగని ఇతర పాత్రలకు ఆయన్ని రీప్లేస్ చేసేవారున్నారని కాదు. అసలు నటుడుగా ఎస్వీఆర్ ఒక్కడే. ఎప్పటికీ ఒక్కడే. కాకపోతే పౌరాణికాల్లో ఆయన నట వైదుష్యం న భూతో అనిపిస్తుంది. యశోదకృష్ణ, శ్రీ కృష్ణలీలలు చిత్రాల్లో కంసునిగా, సంపూర్ణ రామాయణంలో రావణాసురుడుగా ఆయన హావభావాలు మరెవరికీ సాధ్యం కావు.
తెలుగు సినిమా గమనాన్ని ప్రధానంగా నాలుగు భాగాలుగా విభజిస్తే పౌరాణికం, జానపదం, చారిత్రకం, సాంఘికంగా చూడొచ్చు. ఈ నాలుగు విభాగాల్లోనే తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన నట శిఖామణి ఎస్వీ రంగారావు. పౌరాణికాల తర్వాత జానపదాల్లోనూ ఆయన నట విశ్వరూపం నేటికీ ఎందరికో యాక్టింగ్ ఇనిస్టిట్యూట్స్ గా ఉన్నదంటే ఒప్పుకుని తీరాల్సిందే. ఆహార్య, ఆంగిక, వాచకాభినయాల్లో పాత్ర స్వభావాన్ని రంగరించి తెరపై ఆవిష్కరించిన పరిపూర్ణ నటుడు ఎస్వీఆర్.
జానపద చిత్రాల్లో మనకు ఎక్కువగా నాయకుడే హైలెట్ గా నిలుస్తాడు. కానీ ఆ నాయకుడి పాత్రను కూడా తేలిపోయేలా చేసే నటన ఎస్వీ రంగారావు సొంతం. పాతాళ భైరవిలో దుష్ట మాంత్రికునిగా ఆయన నటన అద్భుతం. నేపాళ మాంత్రికుడిగా ఆయన చెప్పిన ఢింగరీ, సాహసం శాయరా డింభకా వంటి మాటలు తెలుగు భాషలో జాతీయాలుగా మిగిలిపోయాయంటే అతిశయోక్తేముందీ.
ప్రతినాయక పాత్రంటే భయపెట్టాలి.. ఎదురుగా నించున్న నాయకుడు కూడా ఓ వైపు వణికిపోవాలి. అలా చేయడంలో ఎస్వీఆర్ ను మించిన వారెవరున్నారు. బాల నాగమ్మ సినిమాలో మాయల మరాఠిగా ఎస్వీఆర్ నటనను మరచిపోగలమా. బాలనాగమ్మను మోహించి ఆమెను అపహరించి పెళ్లి చేసుకోవాలని చూస్తాడు. కానీ ఆమె తనయుడి చేతిలో ఆఖరుకి హతమవుతాడు. ఈ సినిమాలో ఎస్వీఆర్ పాత్ర చాలా ఆలస్యంగా ఎంట్రీ ఇస్తుంది. అయితేనేం ఆ తర్వాత మరే నటుడూ ఆయన ముందు నిలబడజాలనంత విశ్వరూపం చూపిస్తాడు..
ఇక అసమాన సాహసికుడు, అత్యంత పాలనాదక్షుడైన విక్రమార్కుని భార్యను చేపట్టి ఆమెను నానా హింసలు పెట్టే మంత్రసిద్ధిగా భట్టి విక్రమార్కలో ఎస్వీ రంగారావు నటనాపాటవాలను మరచిపోగలమా. యువరాణిని చేపట్టడానికి విక్రమార్క వేషంలో వెళ్లి భంగపడి.. ఆపై అనేక కుతంత్రాల తర్వాత ఆమెను అపహరించే పాత్రలో ఎస్వీఆర్ ను తప్ప ఇంకెవరినీ.. ఊహించలేం కూడా.
చేసే పాత్రాలో పరకాయ ప్రవేశం చేసి హండ్రెడ్ పర్సెంట్ మెప్పించిన ఒన్ అండ్ ఓన్లీ ఆర్టిస్ట్ ఎస్వీరంగారావు. పాత్రల తాలూకూ హుందాతనాన్ని, చాతుర్యాన్నీ, గాంభీర్యాన్నీ పలికిస్తూ నవరసాలూ అలవోకగా పలికించడంలో ఎస్వీఆర్ మేటి. డైలాగ్ డెలివరీలో ఆయన బాణీ అనితరసాధ్యం. విసురు, విసుగు, పొగరు, వగరు వంటివన్నింటినీ అవలీలగా పలికించడంలో ఘనాపాటి.. ఇక చారిత్రక సినిమాల్లోనూ ఎస్వీఆర్ నటన మనల్ని సమ్మోహితుల్ని చేస్తుంది.
విక్రమార్క విజయం సినిమాలో ఎస్వీ రంగారావు నటన చూడటానికి రెండు కళ్లూ చాలవు. ఒక రకంగా ఏక పాత్రాభినయంలాగా కొనసాగే ఓ సన్నివేశంలో ఆయన పలికిన సంభాషణలు, చూపిన నటన న భూతో న భవిష్యత్ అనేలా ఉంటుంది. ఆయన్ని సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని ఎందుకంటారో ఈ సన్నివేశం చూస్తే చాలు.. అర్థమైపోతుంది.
చారిత్రక కేటగిరీలో ఆయన చేసిన పాత్రలు తక్కువే కావొచ్చు. అయినా బొబ్బిలియుద్ధంలో తాండ్ర పాపారాయుడుగా ఎస్వీఆర్ నట విశ్వరూపాన్ని చూస్తాం. ఇలాంటి పాత్రలు చేయడం కత్తిమీద సాము. ఈ పాత్రలకు పెద్దగా రిఫరెన్స్ లు ఉండవు. ఆ పాత్ర చేస్తోన్న ఆర్టిస్ట్ ఎక్స్ పీరియన్స్, ఎక్స్ పెక్టేషన్ కు మధ్యే ఆ క్యారెక్టర్ ను ప్రెజెంట్ చేయగలడు. ఈ విషయంలో ఎస్వీఆర్ మించినవారెవరున్నారు.
ఇక సాంఘిక చిత్రాలకు ఓ పెద్ద దిక్కుగా నిలబడి తాను ఉన్నంత వరకూ ఎన్నో సినిమాలను బ్రతికించిన నటశాల ఎస్వీ రంగారావు. ఎంతటి మహానటులనైనా డామినేట్ చేయగల సామర్థ్యం ఎస్వీ రంగారావు సొంతం. అందుకే ఈయనతో సీన్ అంటే నాటి నటులు ఎంతో భయపడేవారట. ఎక్కడ తమ పాత్ర ఆయన ముందు డామినేట్ అవుతుందోనని. ఒక్క సావిత్రి మాత్రమే ఆయన ముందు తేలిపోకుండా నిలబడగలిగింది. ఆయన్లోని మరో మహానటుడి ఆవిష్కరణకు బంగారు పాప ఓ తిరుగులేని ఉదాహరణ.
తన సుదీర్ఘ నట ప్రయాణంలో ఎస్వీ రంగారావు పోషించిన ప్రతి పాత్రా ఓ కళాత్మక మజిలీ. పాత్రను చంపేసి తను మాత్రమే ఎలివేట్ కావాలనే స్వార్థం ఎస్వీఆర్ లో ఎప్పుడూ లేదు. అందుకే ఆయన ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. సాంఘిక చిత్రాల్లో ఆయన చేసిన ప్రతి పాత్రనూ ప్రేక్షకులు విపరీతంగా ప్రేమించారు. తండ్రిగా, జమిందార్ గా, పేదవాడిగా, అన్నగా, కుటుంబ పెద్దగా.. ఇలా ఏ పాత్రైనా సరే.. మనకు పాత్ర కనిపిస్తుంది తప్ప ఆయన కాదు. ఇంతటి కాంట్రాస్ట్ నిండిన పాత్రల్లో అంతటి ప్రతిభ చూపిన నటుడు మనకు ప్రపంచ సినీ చరిత్రలోనే మరొకరు కనిపించరు.
చూడ్డానికి గంభీరంగా కనిపించినా ఎస్వీ రంగారావు మంచి చమత్కారి. పాత్రల పరంగా అది మనకు ఎన్నో సినిమాల్లో కనిపిస్తుంది. మిస్సమ్మలో హీరోయిన్స్ కు తండ్రిగా గుండమ్మ కథలో హీరోలకు తండ్రిగా ఎస్వీఆర్ చమత్కారం అందరికీ తెలుసు. ఈ రెండు సినిమాల్లోనూ ఆ పాత్రలను సమున్నంతగా ఆవిష్కరించారు..
అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచిన ఎన్నో సినిమాల్లో ఎస్వీర్ నటన మనకు శిఖరస్థాయిలో కనిపిస్తుంది. కలిసి ఉంటే కలదు సుఖం సినిమాలో ఆయన నటన అసామాన్యం. ఉమ్మడి కుటుంబ పెద్దగా, భార్యకు ఎదురు చెప్పలేని భర్తగా, తమ్ముడుతో విడిపోలేకపోయిన అన్నగా అన్ని పార్శ్వాల్లోనూ ఎస్వీ రంగారావు నటన కన్నీళ్లు పెట్టిస్తుంది.
ఇవే కాదు.. యాక్షన్ సినిమాల్లోనూ ఎస్వీఆర్ మైమరపిస్తాడు. ఇలాంటి సినిమాల్లో నటనకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అయినా ఆయా సినిమాల్లోనూ తనదైన ముద్రవేస్తూ ఆయన చెప్పిన తిట్లలాంటి డైలాగులు కూడా ఫేమస్ అయ్యాయి. గూట్లే, డోంగ్రీ, బేవకూఫ్ వంటి పదాలు దశాబ్ధాల పాటు నాటి కాలేజ్, స్కూల్స్ లో చాలాచాలా కామన్ అయ్యాయి. అదంతా ఎస్వీఆర్ వాచక మహిమే.
విశ్వనట చక్రవర్తి, నటసార్వభౌమ, నట యశశ్వి, నట సింహ.. వంటి బిరుదులెన్నో పొందిన మేరునటధీరుడు ఎస్వీ రంగారావు. ముళ్లపూడి వెంకట రమణ మాటల్లో చెబితే ఆయన క్లిష్టపాత్రల్లో చతురంగారావు.. దుష్టపాత్రల్లో క్రూరంగారావు.. హడలగొట్టే భయంకరంగారావు.. హాయిగొలిపే టింగురంగారావు.. రొమాన్సులో పూలరంగారావు.. నిర్మాతల కొంగుబంగారావు.. స్వభావానికి ‘ఉంగారంగారావు.. కథ నిర్బలం అయితే హావభావాలు పాత్రపరంగారావు.. కళ్ళక్కట్టినట్టు కనబడేది ఉత్తి యశ్వీరంగారావు.. ఆయన శైలీ ఠీవీ అన్యులకు సులభంగారావు.. ఒకోసారి డైలాగుల్లో మాత్రం యమకంగారంగారావు.. మొత్తంగా ఆయన తెలుగువారికి మాత్రమే దొరికిన ఎస్వీ రంగారావు..

 

– యశ్వంతుడు

 

Continue reading
రావు బహదూర్ మూవీ ఆడియన్స్ ఆకట్టుకుంటుందా..?

టాలీవుడ్‌లో కొత్త కథల కోసం ప్రేక్షకులు ఎప్పుడూ ఎదురుచూస్తుంటారు. అలాంటి సమయంలో వస్తున్న ‘రావు బహదూర్’ సినిమాపై సినీ అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా టైటిల్, ఫస్ట్ లుక్, ప్రమోషన్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. ‘రావు బహదూర్’ అనే టైటిల్ వినగానే ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్, బలమైన కథ గుర్తుకు వస్తుంది. మూవీ టీమ్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కూడా అలాగే అనిపిస్తోంది. సినిమా కేవలం మాస్ ఎలిమెంట్స్‌కే పరిమితం కాకుండా, కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే అంశాలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.
అయితే ప్రస్తుతం ఆడియన్స్ స్టోరీ, స్క్రీన్‌ప్లే, ఎమోషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. పెద్ద స్టార్ హీరో ఉన్నా, భారీ బడ్జెట్ ఉన్నా కథ బలంగా లేకపోతే సినిమాల పరిస్థితి అంతే సంగతులు అని ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు నిరూపిస్తున్నాయి. అదే సమయంలో మంచి కంటెంట్ ఉంటే చిన్న సినిమాలను కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాలుగా నిలబెడుతున్నారు.
ఈ నేపథ్యంలో ‘రావు బహదూర్’ కూడా తన కథతో ప్రేక్షకులను మెప్పించాల్సిన అవసరం ఉంది. ట్రైలర్, టీజర్ ద్వారా కనిపించిన అంశాలు ఆసక్తిని పెంచినా, అసలు ఫలితం మాత్రం సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది.
మొత్తానికి, ‘రావు బహదూర్’ ప్రస్తుతం మంచి బజ్‌ను సొంతం చేసుకుంది. కానీ ఆ అంచనాలను విజయంగా మార్చుకోవాలంటే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే కథను చూపించాల్సిందే. విడుదల తర్వాత ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి.

Continue reading
అఖిల్‌కు ‘లెనిన్’తో అయినా భారీ హిట్ దొరుకుతుందా?

అక్కినేని అఖిల్ సినీ కెరీర్ ప్రారంభమై చాలా సంవత్సరాలు అవుతున్నా, ఆయన అభిమానులు ఎదురుచూస్తున్న భారీ కమర్షియల్ హిట్ మాత్రం ఇంకా రాలేదు. మంచి లుక్స్, డ్యాన్స్, ఫైట్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయారు.ఇప్పుడు అఖిల్ ఆశలన్నీ ‘లెనిన్’ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమా ఆయన కెరీర్‌ను పూర్తిగా మార్చేస్తుందా? అనే చర్చ ఇప్పటికే సినీ వర్గాల్లో మొదలైంది.
‘లెనిన్’ అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. టైటిల్‌నే పవర్‌ఫుల్‌గా ఉండటంతో పాటు, పోస్టర్లు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అఖిల్ ఈ సినిమాలో గత చిత్రాల కంటే పూర్తిగా భిన్నమైన లుక్‌లో కనిపిస్తున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా క్లాస్, లవ్ స్టోరీలతో కనిపించిన అఖిల్, ఈసారి మాస్ యాక్షన్ పాత్రలో కనిపిస్తున్నాడు.
అఖిల్ నటించిన గత సినిమాల్లో కొన్ని మంచి ప్రయత్నాలుగా నిలిచినా, అవి బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాలు సాధించలేదు. దీంతో ఆయన తర్వాతి సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి ప్రతి సారి పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ‘లెనిన్’ విజయం సాధిస్తే, అది కేవలం ఒక హిట్ మాత్రమే కాదు… అఖిల్ కెరీర్‌కు కొత్త ఆరంభం కావచ్చు.
సినిమా విజయంలో స్టార్‌డమ్‌తో పాటు బలమైన కథ కూడా చాలా ముఖ్యం. ‘లెనిన్’ విషయంలో మేకర్స్ కథపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. యాక్షన్, ఎమోషన్, కమర్షియల్ అంశాలను సమతుల్యంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
అఖిల్ అభిమానులు మాత్రం ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో కూడా ‘లెనిన్’కు సంబంధించిన ప్రతి అప్డేట్ వైరల్ అవుతోంది. సరైన కంటెంట్ ఉంటే అఖిల్ ఈసారి బాక్సాఫీస్ వద్ద బలంగా నిలబడతారని అభిమానులు నమ్ముతున్నారు.

‘లెనిన్’ అఖిల్ కెరీర్‌ను మార్చేస్తుందా? అంటే ఈ ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్పడం కష్టం. కానీ ఒక విషయం మాత్రం నిజం… అఖిల్ కెరీర్‌లో ‘లెనిన్’ అత్యంత కీలకమైన సినిమా. కథ, దర్శకత్వం, సంగీతం, యాక్షన్, ప్రేక్షకుల అంచనాలు… ఇవన్నీ కలిసొస్తే ఈ సినిమా అఖిల్‌కు చాలా కాలంగా ఎదురుచూస్తున్న భారీ విజయాన్ని అందించే అవకాశం ఉంది.
అక్కినేని అఖిల్‌కు ప్రస్తుతం అత్యవసరమైనది ఒక పెద్ద కమర్షియల్ హిట్. ఆ అవకాశాన్ని ‘లెనిన్’ అందిస్తుందా లేదా అనేది సినిమా విడుదలైన తర్వాతే తేలుతుంది. కానీ ఇప్పటివరకు వచ్చిన ప్రమోషన్స్, టైటిల్, అఖిల్ కొత్త లుక్ మాత్రం అభిమానుల్లో మంచి అంచనాలను పెంచాయి. ఇప్పుడు ఆ అంచనాలను సినిమా ఎంతవరకు అందుకుంటుందనేదే అసలు పరీక్ష.

Continue reading
‘లేడీస్ & లేడీస్’ టీజర్‌తో అంచనాలు పెంచిన ‘టాక్సిక్’..

రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమా నుంచి తాజాగా విడుదలైన ‘లేడీస్ & లేడీస్’ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ టీజర్‌లో సినిమా కథను పూర్తిగా రివీల్ చేయకుండా, సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న హీరోయిన్లను స్టైలిష్‌గా పరిచయం చేశారు.

ఈ టీజర్‌లో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ గ్లామరస్‌తో పాటు పవర్‌ఫుల్ లుక్స్‌లో కనిపించారు. ప్రతి పాత్ర వెనుక ఒక పెద్ద కథ దాగి ఉన్నట్లుగా విజువల్స్‌ను డిజైన్ చేశారు.

టీజర్‌లో యష్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈసారి పూర్తి ఫోకస్ మహిళా పాత్రలపైనే ఉండటంతో సినిమా కథలో వారి పాత్రలు ఎంత కీలకంగా ఉండబోతున్నాయనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రాన్ని స్టైలిష్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందిస్తున్నారు.

అయితే టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మిక్స్ డ్ రెస్పాన్స్ కనిపించింది. కొందరు టీజర్ విజువల్స్, మేకింగ్, స్టార్ కాస్ట్‌ను ప్రశంసిస్తుండగా, మరికొందరు మహిళా పాత్రలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

ఇప్పటికే చాలాసార్లు పోస్ట్ పోన్ అయిన ఈ మూవీని ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ప్యాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

‘లేడీస్ & లేడీస్’ టీజర్‌తో ‘టాక్సిక్’ సినిమాపై మరోసారి డిస్కషన్ మొదలైంది. మహిళా పాత్రలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో సినిమా విడుదలైన తర్వాతే పూర్తి స్థాయిలో తెలుస్తుంది. అయితే టీజర్ మాత్రం ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి.

Continue reading
దిల్ రాజు బయోగ్రఫీ: చిన్న వ్యాపారం నుంచి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన సక్సెస్ స్టోరీ

తెలుగు సినిమా పరిశ్రమలో విజయవంతమైన నిర్మాతల జాబితాలో ఎప్పుడూ ముందుండే పేరు దిల్ రాజు. మంచి కథలను ఎంపిక చేయడంలో ఆయనకు ఉన్న నైపుణ్యం, కొత్త దర్శకులను ప్రోత్సహించే తీరు, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలను నిర్మించడం వల్ల టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. నిర్మాతగా మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూటర్‌గా కూడా ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
దిల్ రాజు అసలు పేరు వి. వెంకటరమణా రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో 18 డిసెంబర్ 1970లో జన్మించాడు. సినిమాల్లోకి రాకముందు దిల్ రాజు వ్యాపార రంగంలో ఉన్నారు. తర్వాత సినిమా డిస్ట్రిబ్యూషన్‌లో అడుగుపెట్టి, ప్రేక్షకుల అభిరుచిని దగ్గరగా అర్థం చేసుకున్నారు. ఏ సినిమా ఎక్కడ బాగా ఆడుతుందనే విషయంలో ఆయనకు వచ్చిన అనుభవం నిర్మాతగా ఎదగడానికి బలమైన పునాది అయింది.
2003లో విడుదలైన ‘దిల్’ సినిమా నిర్మాతగా వెంకట రమణ రెడ్డి తొలి పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో అప్పటి నుంచి సినీ పరిశ్రమలో ఆయనను “దిల్ రాజు” అని పిలవడం ప్రారంభమైంది. ఆ పేరు తరువాత ఆయన అసలు పేరుకంటే ఎక్కువగా ప్రజల్లో ప్రాచుర్యం పొందింది.’దిల్’ మూవీతో ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస విజయాలతో టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతగా తన స్థానానికి చేరాడు.చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్నాయి.

కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చిన నిర్మాత

దిల్ రాజు గురించి చెప్పేటప్పుడు తప్పకుండా ప్రస్తావించాల్సిన విషయం కొత్త ప్రతిభను ప్రోత్సహించడం. మంచి కథ ఉంటే కొత్త దర్శకులతో కూడా సినిమాలు చేయడానికి ఆయన వెనుకాడరు. ఈ కారణంగా పలువురు యువ దర్శకులు, రచయితలు, నటులకు ఆయన ద్వారా సినీ పరిశ్రమలో అవకాశాలు లభించాయి.

దిల్ రాజు కుటుంబం

దిల్ రాజు తొలి భార్య అనిత 2017లో అనారోగ్యంతో మరణించారు. అనంతరం 2020లో వైఘా రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఆయనకు కుమార్తె హన్షిత రెడ్డి సినీ నిర్మాణ రంగంలో కూడా చురుకుగా వ్యవహరిస్తున్నారు. దిల్ రాజు కుటుంబ విషయాలను సాధారణంగా వ్యక్తిగతంగానే ఉంచుతారు.
దిల్ రాజు కేవలం నిర్మాత మాత్రమే కాదు, టాలీవుడ్‌లో అత్యంత ప్రభావవంతమైన డిస్ట్రిబ్యూటర్లలో కూడా ఒకరు. చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాల వరకు సమర్థవంతంగా విడుదల చేయడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది. కథకు ప్రాధాన్యం ఇవ్వడం, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు నిర్మించడం ఆయన విజయానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

దిల్ రాజు అందుకున్న గుర్తింపు

దిల్ రాజు నిర్మించిన అనేక చిత్రాలు నంది అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులుతో పాటు పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్నాయి. నాణ్యమైన సినిమాలు నిర్మించే నిర్మాతగా ఆయనకు పరిశ్రమలో మంచి గౌరవం ఉంది.
దిల్ రాజు బయోగ్రఫీ చూస్తే, సాధారణ వ్యాపారిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం నేడు టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతగా ఎదిగిన విజయగాథగా కనిపిస్తుంది. సరైన కథలను ఎంచుకోవడం, కొత్త ప్రతిభను నమ్మడం, ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకోవడం వల్లే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధిలో దిల్ రాజు పాత్ర ఎంతో ముఖ్యమైనది. భవిష్యత్తులో కూడా ఆయన నుంచి మరిన్ని విజయవంతమైన చిత్రాలు రావాలని సినీ అభిమానులు ఆశిస్తున్నారు.

 

Continue reading
కార్తికేయ… సడెన్ గా ఎందుకు సైలెంట్ అయ్యాడు..?

యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ పేరు టాలీవుడ్‌లో ఒక్కసారిగా మారుమోగిపోయింది. 2018లో వచ్చిన RX 100 సినిమా అతని కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. డిఫరెంట్ లుక్, ఇంటెన్స్ యాక్టింగ్‌తో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసిన కార్తికేయ.. ఇప్పుడు మాత్రం కొంతకాలంగా పెద్దగా వార్తల్లో కనిపించడం లేదు.

అసలు ఏం జరిగింది? సినిమాలకు దూరమయ్యాడా? లేక ప్లాన్ మార్చుకున్నాడా?

ఫ్యాక్ట్ ఏంటంటే… కార్తికేయ సినిమాలు పూర్తిగా ఆపలేదు. కానీ RX 100 తర్వాత వచ్చిన సినిమాలు అతనికి అదే స్థాయి బ్రేక్ ఇవ్వలేకపోయాయి. హిప్పీ, గుణ 369, 90ML వంటి సినిమాలతో ప్రయత్నించినా.. తొలి సినిమా ఇచ్చిన ఇంపాక్ట్‌ను రిపీట్ చేయలేకపోయాడు. ఇలాంటి సమయంలో హీరోగా మాత్రమే కాకుండా కొత్త అవకాశాలపై దృష్టి పెట్టాడు. ముఖ్యంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా అంగీకరించాడు. అందులో వలిమై సినిమాలో విలన్ పాత్ర ఒక ఉదాహరణ. ఈ సినిమా ద్వారా ఇతర భాషల్లో కూడా పరిచయం అయ్యాడు.
ప్రస్తుతం అతని కెరీర్‌లో కనిపిస్తున్న గ్యాప్‌కు ప్రధాన కారణం — సినిమాల కొరత కంటే, సరైన స్క్రిప్ట్ ఎంపికపై ఫోకస్ పెంచడం అని చెప్పొచ్చు. ఒకప్పుడు వరుస సినిమాలు చేయడం కంటే, తన ఇమేజ్‌కు సరిపోయే కథల కోసం వేచి చూస్తున్నాడు.
అలాగే పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితానికి కూడా కొంత సమయం కేటాయిస్తున్నాడు. దీంతో సోషల్ మీడియాలో, సినిమా ప్రమోషన్స్‌లో కూడా అతని యాక్టివ్‌నెస్ కొంచెం తగ్గింది. అయితే “కార్తికేయ సినిమాలకు గుడ్‌బై చెప్పాడు” అనే వార్తలకు ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. అతను ఇంకా సినిమాల్లోనే ఉన్నాడు. సరైన ప్రాజెక్ట్‌తో మళ్లీ బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అయితే RX 100తో వచ్చిన క్రేజ్‌ను నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు. కానీ కార్తికేయ లాంటి టాలెంటెడ్ యాక్టర్‌కు సరైన కథ దొరికితే మరోసారి బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది.

Continue reading
ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ సంచలనం సృష్టిస్తుందా..?

జూనియర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మరోసారి రాబోతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూవీ అనౌన్స్ అయింది. ప్రస్తుతం గాడ్ ఆఫ్ వార్ అనే వర్కింగ్ టైటిల్ వినిపిస్తోంది. ఇప్పటికే అరవింద సమేత వీర రాఘవతో ఈ కాంబో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేయబోయే ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగాయి.
సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్, దేవుడి పాత్ర, భారీ విజువల్ స్కేల్ అంటూ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎన్టీఆర్ ఏ దేవుడి పాత్రలో నటిస్తున్నాడనే విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. ఆ విషయంలో మాత్రం ఓ స్పష్టమైన క్లారిటీ రావాల్సి ఉంది. మాగ్జిమం కార్తికేయుడు పాత్రలో కనిపించబోతున్నాడు అనేది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్.
అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. త్రివిక్రమ్ ఈసారి తన రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ ఫార్మాట్‌ను దాటి ఒక భారీ మైథలాజికల్ ప్రపంచాన్ని క్రియేట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడనేది మాత్రం స్పష్టం. పురాణాలు, చరిత్ర, ఫాంటసీ అంశాలను కలిపి ఒక ఎపిక్ కథను సిద్ధం చేశాడు అనేది క్లియర్.
ఎన్టీఆర్ విషయానికి వస్తే… ఆయనకు పౌరాణిక పాత్రలు కొత్త కాదు. చిన్న వయసులోనే పౌరాణిక పాత్రలు చేసిన అనుభవం ఉంది. తన డైలాగ్ డెలివరీ, హావభావాలతో ఇలాంటి పాత్రలకు సరిపోయే నటుడిగా ఆల్రెడీ ప్రూవ్ అయిన నటుడు. అందుకే ఎన్టీఆర్‌ను దేవుడి తరహా పాత్రలో చూడాలనే వార్తలకు ఫ్యాన్స్ నుంచి భారీ స్పందన వస్తోంది.
కానీ ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌లు కేవలం స్టార్ పవర్‌తో కాకుండా కథ, విజువల్స్, టెక్నికల్ ఎగ్జిక్యూషన్‌పై ఆధారపడి ఉంటాయి. త్రివిక్రమ్ తన రైటింగ్ స్టైల్ తో ఈ పురాణ ప్రపంచాన్ని ఎలా ఆవిష్కరిస్తాడు? ఎన్టీఆర్ పాత్రను ఏ స్థాయిలో చూపిస్తాడు? అనేదే అసలు ఆసక్తి. కానీ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలయిక మాత్రం మరోసారి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది.

Continue reading
నాగబంధం మూవీ ఎలా ఉండబోతోంది?

టాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో పౌరాణికం, మిస్టరీ, ఫాంటసీ జానర్‌లపై ఆసక్తి పెరుగుతోంది. అదే కోవలో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ నాగబంధం(Nagabandham). జూలై 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీలో విరాట్ కర్ణ(Virat Karna) హీరోగా నటించాడు. నభా నటేష్(Nabha Natesh), ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా చేశారు. అభిషేక్ నామా దర్శకుడు.
నాగబంధం ఒక ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. నాగ శక్తి, పురాతన రహస్యాలు, ఆధ్యాత్మిక అంశాలు, యాక్షన్ అంశాలను కలిపి కథను నడిపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రధాన ఆకర్షణల్లో ఒకటి దీని కాన్సెప్ట్. సాధారణ కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా.. భారతీయ నమ్మకాలు, పురాణాల నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం కనిపిస్తోంది. నాగ దేవత, రహస్యమైన శక్తులు అనే అంశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
విజువల్స్ విషయంలో కూడా సినిమా టీమ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ఇలాంటి జానర్ సినిమాలకు గ్రాఫిక్స్, VFX, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా కీలకం. కథలోని ఫాంటసీ ఎలిమెంట్స్‌ను ప్రేక్షకులకు నమ్మేలా చూపించగలిగితే ఈ సినిమా పెద్ద ప్లస్ అవుతుంది. అయితే ఇలాంటి సినిమాలకు పెద్ద సవాల్ కూడా ఉంటుంది. కేవలం భారీ సెట్స్, గ్రాఫిక్స్ ఉంటే సరిపోదు.. కథలో బలం, పాత్రల ఎమోషన్, స్క్రీన్‌ప్లే ఆకట్టుకోవాలి. ప్రేక్షకుడు ఆ ప్రపంచంలోకి వెళ్లేలా చేయగలిగితేనే ఫాంటసీ సినిమాలు విజయవంతం అవుతాయి.
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు కొత్త కంటెంట్‌ను స్వీకరించే మూడ్‌లో ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారతీయ కథలకు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో.. నాగబంధం కూడా సరైన ఎగ్జిక్యూషన్‌తో వస్తే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి.. నాగబంధం ఒక రెగ్యులర్ సినిమా కాదు. పురాణం, మిస్టరీ, ఫాంటసీ కలయికతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలని ప్రయత్నిస్తున్న సినిమా. ఆ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో జూలై 3 తర్వాతే తెలుస్తుంది.

Continue reading
రవితేజ మారుతున్నాడా..?

మాస్ మహరాజ్ రవితేజ.. ఈ ట్యాగ్ లైన్ కు తగ్గట్టుగానే అతను ఎంచుకున్న కథల్లో అప్పుడు సత్తా చాటాడు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా మనమూ మారాలి. అప్డేట్ కావాలి. బట్ ఈ విషయంలో రవితేజ చాలాకాలం పాటు అప్డేట్ కాలేకపోయాడు. అదే పనిగా మూవీస్ అన్నీ పోతున్నా అతను మారలేదు. ఓ దశలో అభిమానులు కూడా ఇవేం మూవీస్ రా బాబూ అని తెగ ఇబ్బంది పడిపోయారు. కొత్తదనం అనే పదానికి చాలా దూరంగా అతని కథలు కనిపించాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఫ్లాపుల దండయాత్ర మొదలైంది. ఒకదాన్ని మించి ఒకటిగా డిజాస్టర్ అయ్యాయి. ఓ దశాబ్దం పాటు కొనసాగిన ఈ ఫ్లాపుల పర్వం అతని కెరీర్ నే ప్రశ్నార్థకంలో పడేసింది. బాగా ఆలస్యం అయినా ఆత్మ పరిశీలనలో పడిపోయాడు. అందులో భాగంగానే భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే మూవీ చేశాడు. ఈ కథలో కొత్తదనం లేదు. బట్ అతను చేయడం వల్ల కొత్తగా అనిపించింది. దీనికి తోడు తన ఇమేజ్ కు దూరంగా ఈ మూవీ చేశాడు. ఈ యేడాది సంక్రాంతి బరిలో విడుదలైన ఈ మూవీ ఓ మోస్తరుగా విజయాన్ని సాధించింది. ఈ టైమ్ లో ఎవ్వరూ ఊహించని కథకు కమిట్ అయ్యాడు రవితేజ.
శివ నిర్వాణ డైరెక్షన్ లో ‘ఇరుముడి’అనే టైటిల్ తో మూవీ అనౌన్స్ చేశాడు. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచింది. అతను కథల విషయంలో ఓ మెట్టు ఎక్కుతున్నాడు అనిపించేలాఈ మూవీ నుంచి ఓ గ్లింప్స్ విడుదల చేశారు. అది చాలామందిని ఆకట్టుకుంది. తాజాగా ఇదే మూవీ నుంచి ఓ పాట విడుదల చేశారు. ఈ పాట ఇరుముడి చుట్టూ సాగే గీతం. అయ్యప్ప మాల వేసుకుని, ఇరుముడి కట్టుకుని దీక్షను విరమించే సందర్భంలో వచ్చే పాట. ఈ పాటలో ఎక్కడా రవితేజ అతి కనిపించలేదు. చాలా సాధారణంగా సాగింది. పాట, సాహిత్యం రెండూ బావున్నాయి. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే మూవీలో చాలా కీలకంగా ఓ పాప కనిపిస్తోంది. ఈ పాటలో తను వేసిన డ్యాన్స్ లు చాలా బావున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతోన్న మూవీ ఇది. ఆగస్ట్ 21న విడుదల కాబోతోంది.
ఏదేమైనా రవితేజ కాలానికి తగ్గట్టుగా మారుతున్నట్టుగానే కనిపిస్తోంది. అదే పనిగా మాస్ రాజా అంటే ఈ రోజుల్లో ఆడియన్స్ కు అంతగా వర్కవుట్ కాదు అనేది అర్థమైనట్టుంది. మరి ఇకనైనా బలమైన కథలను ఎంచుకుంటూ తనలోని కొత్త యాంగిల్ ను చూపిస్తూ.. అప్పుడప్పుడు మాస్ యాంగిల్ ను కూడా బయటకు తీసుకువస్తే తన మళ్లీ రేంజ్ మారుతుంది.

Continue reading
ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ అనౌన్స్ అయింది..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ మూవీ రాబోతోందని గతంలోనే చెప్పారు. చెప్పినట్టుగా ఈ మూవీ ఇవాళ అఫీషియల్ గా అనౌన్స్ అయింది. అనౌన్స్ మెంట్ తో పాటు విడుదల చేసిన పోస్టర్ మాత్రం చాలామందిలో క్యూరియాసిటీ పెంచుతోంది. ఇది ఓ పౌరాణిక కథ. పౌరాణికాలు అంటే ఎన్టీఆర్ తర్వాత మళ్లీ ఈ ఎన్టీఆర్ మాత్రమే చేయగలడు అని చిన్నప్పటి రామాయణంతోనే ప్రూవ్ చేసుకున్నాడు ఎన్టీఆర్. అందుకే ఇది ఓ అద్భుతమైన పౌరాణిక గాథ అని తెలుస్తోంది. అదీ కాక త్రివిక్రమ్ కు ఇలాంటి కథలపై ఎంత ఆసక్తి ఉందో చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ మూవీ అనౌన్స్ మెంట్ పోస్టర్ చూస్తే చాలా విషయాలు తెలిసేలా ఉన్నాయి.
ఈ పోస్టర్ లో త్రిశూలం కనిపిస్తోంది. ఆ త్రిశూలంలో డిఎన్ఏ సింబల్ కూడా ఉంది. అంటే ఇది సోషల్ డ్రామా నుంచి పౌరాణికం వరకు వెళుతుందా అని చాలామంది భావిస్తున్నారు. బట్ అదేం కాదు. ఈ మూవీలో కార్తికేయుడు పాత్రలో కనిపించబోతున్నాడు ఎన్టీఆర్. కార్తికేయుడు అంటే శివుని అంశ. అది కాకుండా పార్వతీ దేవి గర్భం నుంచి కాక విశ్వ బీజం నుంచి ఆయన పుట్టుకు ఉంటుంది అని అర్థం. అంటే కేవలం శివ పార్వతుల అంశతో మాత్రమే కార్తికేయుడు జన్మించాడు అని వేరే చెప్పక్కర్లేదు. కార్తీకేయుడు అంటే యుద్దాలు చాలానే ఉంటాయి. అందుకే పోస్టర్ లో దాన్ని కూడా ఇన్ డైరెక్ట్ గా తెలిపేలా డిజైన్ చేశారు. ఏదేమైనా ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పలేదు కానీ ముందైతే అనౌన్స్ అయింది.
ఈ మూవీ అనౌన్స్ మెంట్ తో ఎన్టీఆర్ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ మూవీ ఉండబోతోంది అనేలా ఉంది. అంటే ఆ మధ్య ముందే నెల్సన్ మూవీ ఉంటుందని కూడా చెప్పారు కొందరు. అలాంటిదేం లేదు అనేలా ఈ అనౌన్స్ మెంట్ చెబుతోంది. ఏదేమైనా అల వైకుంఠపురములో తర్వాత ఆరేళ్ల గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ ఈ కథపై చాలా కసరత్తులు చేశాడు. అందుకే ఇదో అద్భుతమైన కథగా ఉండబోతోంది అని తెలుస్తోంది. ఆయన ఆదర్శ కుటుంబం తర్వాత ఇక తన ఫోకస్ అంతా ఈ మూవీపైనే పెట్టబోతున్నాడు అనేది స్పష్టం.

Continue reading