చిన్నవయసులోనే వెండితెరంగేట్రం చేసిన నటి విజయశాంతి. గ్లమరస్ పాత్రలతో మొదలై.. లేడీ ఓరియంటెడ్ పాత్రలకే వన్నెతెచ్చిన భారతనారి. హీరో స్వామ్యం నడిచే ఇండస్ట్రీలో నటిగా దాన్ని ప్రతిఘటించిన ధీశాలి. ఇండియన్ సినిమా హిస్టరీలో లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న ఏకైక నటి. అబితాబ్ బచ్చన్, రజినికాంత్ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్ విజయశాంతి. డబ్బింగ్ చిత్రాలతోనే తమిళనాట నెంబర్ వన్ హీరోయిన్ గా వెలుగొందిన అరుదైన నటీమణి విజయశాంతి.
విజయశాంతి అసలు పేరు శాంతి. ఆమె తెరపేరు లోని విజయ తన పిన్ని విజయలలిత పేరు నుండి తీసుకుంది. విజయశాంతిని కథానాయకిగా తెరకు పరిచయము చేసింది భారతీరాజా. ఆయన దర్శకత్వంలో 1979లో వచ్చిన తమిళ సినిమా కల్లుక్కుళ్ ఈరమ్ కథానాయికగా విజయశాంతి మొదటి సినిమా. తెలుగులో విజయశాంతి తొలి చిత్రం కూడా అదే ఏడాది ప్రారంభమై ఆ తరువాతి ఏడు విడుదలైన కిలాడి కృష్ణుడు. ఈ చిత్రంలో హీరో సూపర్ స్టార్ కృష్ణ, దర్శకురాలు విజయనిర్మల. తర్వాత కృష్ణతో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో నటించింది విజయశాంతి.
హీరోయిన్ గా పరిచయమైన మొదటి నాలుగు సంవత్సరాల పాటు తెలుగు, తమిళ్ లో ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేసింది విజయశాంతి. వీటిలో కూడా పెద్ద హిట్స్ గా నిలిచినవి చాలా తక్కువ. విజయశాంతికి తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చిన సినిమా టి.కృష్ణ దర్శకత్వంలో ఈ తరం సంస్థ 1983 లో నిర్మించిన నేటి భారతం. అప్పటి నుండి ఆమె వెనుదిరిగి చూసుకోనవసరం లేకుండాపోయింది. క్రమంగా కథానాయికగా ఒక్కో మెట్టే అధిరోహిస్తూ దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోనే మరే నటీ అందుకోలేని స్థాయికి చేరింది.
తొలి నాలుగేళ్లలో కిలాడీ కృష్ణుడు, పెళ్లీడు పిల్లలు, సత్యం -శివం, వంశగౌరవం, కృష్ణావతారం, రాకాసి లోయ, పెళ్లిచూపులు వంటి తెలుగు చిత్రాల్లో రెగ్యలర్ హీరోయిన్ వేషాలే వచ్చాయి .అయితే రాశి పరంగా తెలుగుకన్నా తమిళంలో ఎక్కువ చిత్రాల్లో నటించినా.. అవేవీ ఆమె గుర్తుంచుకోదగ్గవి కావు. 1981లో వచ్చిన రజంగం అనే తమిళ చిత్రంలో స్విమ్ సూట్ వేసి కొద్దిపాటి సంచలనం సృష్టించిందామె.
జయసుధ, జయప్రద అభినయంతో, శ్రీదేవి, మాధవి అందచందాలతో తెలుగు తెరను ఏలుతున్న రోజుల్లో ప్రారంభమైంది విజయశాంతి సినీ ప్రస్థానం. 1979లో తొలిసారి కథానాయికగా కెమెరా ముందుకొచ్చేనాటికి ఆమె వయసు కేవలం పదిహేనేళ్లు. భారతీరాజా వంటి క్రియేటివ్ డైరెక్టర్ వద్ద నటనలో ఓనమాలు దిద్దుకున్నా ఆమె తనకంటూఓ ఇమేజ్ తెచ్చుకోవడానికి చాలాకాలమే నిరీక్షించాల్సి వచ్చింది. నేటి భారతం తర్వాత విజయశాంతి ప్రస్థానం ప్రతి హీరోయిన్ కుళ్లుకునేలా సాగిందంటే అతిశయోక్తి కాదు.
1985 నటిగా విజయశాంతి విశ్వరూపం ప్రదర్శంచిన సంవత్సరం. ఆ ఏడాది వందేమాతరం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, ప్రతిఘటన వంటి ప్రగతిశీల చిత్రాల్లో రెబల్ ఛాయలున్న కథానాయిక పాత్రల్లోనూ , అగ్ని పర్వతం, పట్టాభిషేకం, చిరంజీవి, దర్జాదొంగ, ఊరికి సోగ్గాడు, శ్రీవారు వంటి చిత్రాల్లో హీరోతో ఆడి పాడే చిలిపి కథానాయికగానూ నటించి తను రెండువిధాలుగానూ ప్రేక్షకులను మెప్పించగలనని ఋజువుచేసింది. ప్రతిఘటన తో అభినయ పరంగా తనకెదురే లేదని నిరూపించుకోగా, జడగంటలు లో టు-పీస్ బికినీ ధరించి అందాల ప్రదర్శన విషయంలో కూడా తనకు హద్దులు లేవని చాటి చెప్పింది.
సౌజన్యం మూర్తీభవించిన కథానాయిక పాత్రలకు.. హుందాతనం ఉట్టిపడే పాత్రలు.. పురుషులను ధిక్కరించే అహంకారపూరిత పాత్రలు.. మొండితనం నిండిన క్యారక్టర్స్ కు .. అందచందాలతో అలరించే పాత్రలు.. ఇలా ఒక్కో రకం కథానాయిక పాత్రకు ఒక్కో నటీ ఫేమస్ అయిన టైమ్ లో, అవన్నీ విజయశాంతి ఒక్కతే పోషించి ప్రేక్షకులను మెప్పించగలదనీ నిరూపించింది. మొత్తంగా 1985లో ఆమె నటించిన పదమూడు తెలుగు సినిమాలు రిలీజ్ అయితే వాటిలో పదకొండు సినిమాలు హిట్టయ్యాయి. దీంతో ఆమె తమిళ మూవీస్కు ఫుల్ స్టాప్ పెట్టి తెలుగు సినిమాలపైనే కాన్ సెంట్రేట్ చేసింది.
1986 విజయశాంతి స్టామినాను కమర్షియల్ నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లిన సంవత్సరం. రేపటి పౌరులు, అరుణ కిరణం, సమాజంలో స్త్రీ, శ్రావణ సంధ్య వంటి ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనూ, అటు ముద్దుల కృష్ణయ్య, దేశోద్ధారకుడు, కొండవీటి రాజా, ధైర్యవంతుడు, సక్కనోడు, బ్రహ్మాస్త్రం వంటి మసాలా చిత్రాల నాయికగానూ నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా దేశోద్ధారకుడు చిత్రంలోని వచ్చె వచ్చె వాన జల్లు పాటలో అందాల ప్రదర్శన విషయంలో ఎలాంటి మొహమాటాలూ పెట్టుకోలేదు. ఈ మూవీతో బాలయ్యతో విజయశాంతిది హిట్ పెయిర్ గా గుర్తింపొచ్చింది.
1980ల సగం నుంచి 90 వరకూ విజయశాంతి కెరీర్ పీక్స్ లో కొనసాగింది. ఈ టైమ్ లో ఆమె ఏం చేసినా హిట్టే అన్నట్టుగా సాగింది కెరీర్. తనే ప్రధాన పాత్రగా ఉన్నా.. హీరోల సరసన కేవలం గ్లామర్ డాళ్ గా ఆడిపాడినా.. అచ్చ తెలుగు ఆడపిల్లగా అయినా.. విజయశాంతి ఈ ఐదారేళ్ల కాలంలో చేసిన పాత్రలు.. సినిమాలు.. అన్నీ సూపర్ హిట్సే. ఓ రకంగా అప్పటి హీరోయిన్లంతా కేవలం గ్లామర్ కే పరిమితమైతే అటు గ్లామర్ ను, ఇటు పర్ఫార్మెన్స్ ను చూపించి ఆల్ రౌండర్ అనిపించుకుంది.
పడమటి సంధ్యారాగం, జానకి రాముడు చిత్రాలలో అచ్చ తెలుగు ఆహార్యమైన లంగా ఓణీలతో ఆమె పోషించిన సంధ్య, జానకి పాత్రలు ఇప్పటికీ ముద్ద బంతి పూవు లాంటి తెలుగు పడుచు పిల్ల సౌందర్యానికి వెండితెర పర్యాయ పదాలుగా నిలచిపోయాయి. ఇవే కాక ఇంద్రుడు – చంద్రుడు, యముడికి మొగుడు, మువ్వ గోపాలుడు, ముద్దుల మామయ్య, పసివాడి ప్రాణం, అత్తకు యముడు – అమ్మాయికి మొగుడు, గూండా రాజ్యం వంటి సూపర్ హిట్ సినిమాలతో విజయానికి మరో పేరు విజయశాంతిగా నిలిచిపోయింది.
ఇక మొత్తం తెలుగు సినిమా చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన సినిమా కర్తవ్యం. అప్పటి వరకూ లేడీ ఓరియంటెడ్ పాత్రలంటే మగదిక్కులేని గంపెడు సంసారాన్ని గుట్టుగా లాగిస్తూ.. సమాజంలో మంచి మహిళగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసినవే. కానీ ఆడదంటే అబల కాదు..ఆమె తలచుకుంటే ఏదైనా సాధిస్తుందని నిరూపించిన సినిమా ఇది. ఈ సినిమా నాటి రోజుల్లో ఎందరు మహిళలకు స్ఫూర్తినిచ్చిందో చెప్పలేం. ఇప్పటికీ పోలీస్ డిపార్ట్ మెంట్ లో చాలామంది సీనియర్ లేడీ ఆఫీసర్స్ తమకు కర్తవ్యం సినిమానే స్ఫూర్తి అని చెప్పుకుంటారు.
అయితే విజయశాంతి చేసిన చాలా చిత్రాల్లో పాత్రల కంటే తమిళ్ లో రజినికాంత్ హీరోగా నటించిన మన్నన్ లోని పాత్ర ది బెస్ట్ అని చెబుతారు. పొగరుబోతు మహిళగా ఈ సినిమాలో ఆమె నటనకు ఫిదా కాని వారు లేరు. ఓ సన్నివేశంలో ఆమె రజినికాంత్ ను చెంపదెబ్బ కొట్టాలి. ఆ పాత్రలో విజయశాంతి కాకుండా ఇంకెవరు చేసినా రజిని అభిమానులు ఊరుకునేవారు కాదని రజినీయే స్వయంగా చెప్పారంటే ఆమె నటన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే చిత్రం తెలుగులో ఘరానామొగుడు గా రీమేక్ కావడం విశేషం.
కర్తవ్యం ఇంపాక్ట్ తో ఆ తర్వాత దాదాపు తనే ప్రధాన పాత్రలో చాలా సినిమాలే చేసింది. వాటిలో కొన్ని హిట్ అయితే మరికొన్ని యావరేజ్ గా నిలిచాయి. ఇదే టైమ్ లో మరికొన్ని గ్లామర్ పాత్రలనూ పోషించింది. బాలయ్యతో నిప్పురవ్వ, చిరంజీవితో మెకానిక్ అల్లుడు తర్వాత ఆమె స్టార్ హీరోల సరసన నటించలేదు. అయితే వీటితో పాటు ఆమె చేసిన మరికొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫట్ మన్నాయి. ఆ టైమ్ లో వచ్చిన ఓ చిత్రం తెలుగు రాష్ట్రాన్ని ఓ ఊపు ఊపేసి.. అప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డులూ తుడిచేసింది. అదే ఓసేయ్ రాములమ్మా.
ఒసేయ్ రాములమ్మా సినిమాతో వచ్చిన ఇమేజ్ తో ఆమె అనూహ్యంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. పొలిటికల్ గా పెద్దగా యాక్టివ్ గా లేని టైమ్ లో మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యే ప్రయత్నం చేశారు. ఆ కోవలో చేసిన రౌడీ దర్బార్ ఎబౌ యావరేజ్ గా నిలిస్తే.. శ్రీవారంటే మావారే, భారతరత్న సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. 2000ల తర్వాత నుంచి విజయశాంతి సినిమా కెరీర్ పూర్తిగా డౌన్ ఫాల్ లో కొనసాగింది. చేసిన ప్రతి సినిమా నిరాశపరిచింది.
శాంభవి ఐ.పి.యస్., వైజయంతి, నాయుడమ్మ, ఇందిరమ్మ వంటి చిత్రాలు ఎప్పుడు విడుదలయ్యాయో కూడా తెలియకుండా ఇలా వచ్చి అలా వెళ్లాయి. ఇవన్నీ ఆమె ప్రధాన పాత్రలో నటించినవే అయినా, కథ, కథనాల్లో ఎటువంటి ప్రత్యేకత లేని చిత్రాలు కావటంతో ఎవరినీ ఆకట్టుకోలేకపోయాయి. దానికి తోడు అదే సమయంలో ఆమె రాజకీయరంగంలో కూడా ఉండటంతో మంచి కథలు ఎంచుకోలేకపోయింది. దీంతో సినిమాలలో ఇంకా సంచలనం సృష్టించగల ప్రతిభ, వయసు ఉన్నా రాజకీయరంగంపై ఆసక్తితో ఆమె సినిమాల నుంచి పూర్తిగా తప్పుకున్నట్టు చెప్పుకోవచ్చు.
సొంతంగా పార్టీ పెట్టి, తర్వాత ఆ పార్టీని టిఆర్ఎస్ లో విలీనం ఓ సారి ఎం.పిగా గెలిచిన విజయశాంతి పొలిటికల్ కెరీర్ కూడా ఇప్పుడేమంత బాగా లేదు. అందుకే మళ్లీ సినిమా రంగంలోకి వస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదీ కాక ఆమె ఎప్పటి నుంచో తన లక్ష్యం తెలంగాణ సాధించడం అని చెబుతూ వచ్చింది. అది సాకారమైంది కాబట్టి.. ఇక రాములమ్మ రీ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఆమె అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం విజయశాంతి లాంటి ఆర్టిస్ట్ అవసరం దక్షిణాది చిత్ర పరిశ్రమకు చాలా ఉంది.






